హైదరాబాద్: ఉన్నత విద్యపై తెలంగాణ జాగృతి ఖతర్ విభాగం వర్చువల్గా అవగాహన సదస్సు నిర్వహిస్తున్నది. తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బాగౌని ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి 7.30 గంటలకు (భారత కాలమానం), సాయంత్రం 5 గంటలకు (ఖతర్ కాలమానం) ఆన్లైన్ వేదికగా జరగనుంది. చదువుకోవాలనే ఆసక్తి ఉండి పరిస్థితులు అనుకూలించక మధ్యలోనే చదువు ఆపేసిన, కొనసాగించలేక పోయిన వారికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని నందిని అబ్బాగౌని అన్నారు. ముఖ్యంగా కార్మికులకు, మహిళలకు దూర విద్యావిధానంలో అందుబాటులో ఉన్న ఉన్నత విద్యాభ్యాస అవకాశాలు, ప్రయోజనాలను గురించి తెలసుకోవచ్చన్నారు.
బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నోడల్ అధికారి పల్లవి కాబ్దే ప్రవేశ అర్హతలు, ఉపయోగాలపై శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తారని తెలిపారు. వివిధ కారణాల ద్వారా చదువు ఆపేసిన గల్ఫ్ కార్మిక సోదరులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, ఉన్నత విద్యను అభ్యసించి వృత్తి పరంగా తమనుతాము తీర్చి దిద్దుకుంటూ, భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని కోరారు.