హైదరాబాద్ : తెలుగు సాహిత్యంలో విశిష్టమైన ప్రక్రియ అష్టావధానం. భాష ,ఛందస్సు, వ్యాకరణం , సమయస్ఫూర్తి , ధారణ ఏకకాలంలో నడుపుతూ చేసే ఈ సాహిత్య ప్రక్రియ తెలుగుభాషా వైభవానికి నిత్యసాక్ష్యం. తటవర్తి గురుకులం ద్వారా వివిధదేశాల పృచ్ఛకులతో అంతర్జాలంలో జరుగుతున్న అవధానార్చన ఇప్పటిదాకా 55 అవధానాలను ఈ సంవత్సరంలో పూర్తిచేసుకుని ,56వ అష్టావధానం ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ నగరం వేదికగా భాషాభిమానుల నడుమ డిసెంబరు 3వ తేదీన ప్రత్యక్షంగా జరగనుంది.
తెలుగు భాషను తమ సామాజిక భాషలలో ఒకటిగా గుర్తించిన ఆస్ట్రేలియా దేశంలో, తెలుగు భాషాభిమానులందరినీ ఏకతాటిపైకి తీసుకువస్తూ, పద్య రచనను నేర్పి నూతన పద్యకవులను తయారుచేస్తూ ఇలా అవధానార్చనలు నిర్వహిస్తోంది తటవర్తి గురుకులం.
ఆస్ట్రేలియా తెలుగు వారందరూ ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమం భారతదేశంలో ఆలయాల అభివృద్ధికి అంకితం చేస్తూ ఆస్ట్రేలియా ప్రథమ అవధాని తటవర్తి శ్రీకళ్యాణ చక్రవర్తి నిర్వహిస్తున్నారు. అవధాని , పృచ్ఛకులు , సంచాలకులు అందరూ మెల్బోర్న్ వారే అవ్వడం, అందులోనూ చంటిపిల్లల తల్లులు కూడా పృచ్ఛకులుగా వస్తూ తమ భాషాభిమానాన్ని తెలుగు వైభవాన్ని చాటడానికి పూనుకోవడం గమనార్హం.
ఇటువంటి ప్రత్యేకతలు కలిగిన ఈ కార్యక్రమానికి సంచాలకులుగా ఆస్ట్రేలియాలో ప్రముఖ పద్యకవి డాక్టర్ వేణుగోపాల్ రాజుపాలెం వ్యవహరిస్తున్నారు. పృచ్ఛకాంశాలైన సమస్యాపూరణం యామిని చతుర్వేదుల, దత్తపది మనోజ్ మోగంటి, వర్ణన అమరేందర్ అత్తాపురం, నిషిద్ధాక్షరి శ్రీనివాస్ బృందావనం, న్యస్తాక్షరి రాజశేఖర్ రావి, ఆశువు రంజిత ఓగిరాల, చిత్రానికిపద్యం అర్చన విస్సావజ్ఝుల, అప్రస్తుతం పల్లవి యలమంచిలి నిర్వహిస్తున్నారు.
ఈ అవధానార్చనను ఆంధ్రప్రదేశ్ కొవ్వూరులో లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అంకితంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ATAI వారు సహాయం చేస్తున్నారు. ఆస్ట్రేలియా తెలుగు సాహిత్యానికి నూతన సొబగులద్దేందుకు సిద్ధమౌతున్న ఈ విశిష్ట అవధానార్చన, ప్రవాస తీరాలలో తెలుగుభాషా వికాసానికి ఒక ఉదాహరణగా నిలుస్తుందని ఆశిద్దాం.