యునైటెడ్ కింగ్డమ్లోని స్కాట్లాండ్ దేశం రామనామస్మరణతో మార్మోగింది. ఆ దేశంలోని అబర్డీన్ ప్రాంతంలోగల హిందూ దేవాలయంలో ఎన్నడూ లేనివిధంగా మొట్టమొదటిసారి శ్రీరామనవమి వేడుకలను కన్నులపండువగా నిర్వహించారు. అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం జరిపించారు. ఈ వేడుకలకు స్కాట్లాండ్లోని తెలుగు ప్రజలతోపాటు ఇతర ఎన్నారైలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ‘శ్రీరామ జయరామ.. జయ జయ రామ’ అంటూ తెలుగు ప్రాంత భక్తులు నినాదాలతో హోరెత్తించారు.
అబర్టీన్ హిందూ దేవాలయంలో సీతారాముల కల్యాణాన్ని పడకంటి వివేక్, గోల్కొండ వేద, రమేశ్బాబు, డాక్టర్ నాగ ప్రమోద్, బోయపాటి హరి ఆధ్వర్యంలో నిర్వహించారు. వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ సీతారాముల కల్యాణం కమనీయంగా సాగింది. స్కాట్లాండ్లోని చుట్టుపక్కల ప్రాంతాలనుంచి మొత్తం 350 మంది ఎన్నారై భక్తులు తరలివచ్చి, కల్యాణాన్ని వీక్షించారు. స్వామివారికి కట్నకానుకలు సమర్పించుకున్నారు. అనంతరం స్వామి వారి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కల్యాణం అనంతరం అన్నదాన ప్రసాద వితరణ చేశారు.