సింగపూర్ వేదికగా ఆన్లైన్లో “శ్రీమద్ భాగవత సప్తాహం” దిగ్విజయంగా ప్రారంభమైంది. ప్రఖ్యాత తెలుగు సంస్థలైన, ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’, ‘తెలంగాణ కల్చరల్ సొసైటీ’, ‘తెలుగు భాగవత ప్రచార సమితి’ ‘కాకతీయ సాంస్కృతిక పరివారం’ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాల వేదికపై ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొదటి రెండు రోజులు విజయవంతంగా కొనసాగాయి. పంచ మహా సహస్రావధాని, అవధాన సామ్రాట్ డా. మేడసాని మోహన్.. శుభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా సింగపూర్ తెలుగు వారి కోసం వారంపాటు అందిస్తున్న ఈ భాగవత ప్రవచన కార్యక్రమ ప్రారంభోత్సవంలో శృంగేరి పీఠాధిపతులు శ్రీ శ్రీ విధుశేఖరానంద భారతిస్వామి, కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి తమ ఆశీస్సులను వీడియో సందేశం రూపంలో అందించారు, ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్, బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాదవ్ పాల్గొన్నారు. సభకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
బీజేపీ రాష్ట్ర కోశాధికారి వామరాజు సత్యమూర్తి, రాజు వంశీ ఆర్ట్ థియేటర్స్ అధ్యక్షుడు డా. వంశీ రామరాజు, అమెరికా నుంచి మల్లిక్ పుచ్చా, ఆస్ట్రేలియా నుంచి విజయ తంగిరాల, న్యూజిలాండ్ నుంచి శ్రీలత మగతల, థాయిలాండ్ నుంచి రవికుమార్ బొబ్బ, మలేషియా నుంచి డా అచ్చయ్య రావు, సౌదీ అరేబియా నుంచి దీపిక రావి తదితరులు పాల్గొన్నారు. భారత్ నుంచి తెలుగు భాగవత ప్రచార సమితి అధ్యక్షుడు ఊలపల్లి సాంబశివరావు దంపతులు, వివిధ దేశాల తెలుగు ప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. మొదటిరోజు భాగవత నేపథ్యం, ఆవిర్భావం, రెండోరోజు మత్స్య కూర్మ వరాహ అవతార విశేషాలపై డాక్టర్ మేడసాని ప్రసంగించారు. కథా విశేషాలతోపాటు పోతన రచనా వైశిష్ట్యం, భాగవత కథలు నుంచి నేర్చుకోవాల్సిన అంశాల గురించి మేడసాని అభివర్ణించారు.
రెండోరోజు కార్యక్రంలో ముఖ్య అతిథిగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు డా. వంగూరి చిట్టెన్ రాజు పాల్గొని సభకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాన నిర్వాహకులు రత్నకుమార్ కవుటూరు, నీలం మహేందర్, ఊలపల్లి భాస్కర్, రాంబాబు పాతూరి, కార్యవర్గ సభ్యులు ప్రశాంత్రెడ్డి, రమేశ్ గడప, శ్రీనివాస్, సుబ్బు వీ పాలకుర్తి, రామాంజనేయులు చామిరాజు, తదితరులు డాక్టర్ మేడసానితోపాటు ఇతర అతిథులకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచ నలుమూలల నుంచి తెలుగువారందరూ కలిసి భాగవత వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, తమ కార్యక్రమాన్ని తప్పక వీక్షించాలని ఆహ్వానించారు. రాధికా మంగిపూడి సభా నిర్వహణ బాధ్యతలు చేపట్టగా, గణేశ్న రాధాకృష్ణ సాంకేతిక నిర్వహణలో ప్రతిరోజూ ఏడు మాధ్యమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.