Bharat Ratna For Ghantasala | అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు ఒక తపస్వి, జ్ఞాని, కర్మయోగి అని శ్రీ పరిపూర్ణానంద స్వామి అన్నారు. భారతీయ సంస్కృతిలో భర్తను భార్య పేరు పెట్టి పిలవనట్లే గురువును కూడా అలా పేరు పెట్టి పిలవరని అన్నారు. ఘంటశాల శత జయంతి సందర్భంగా ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వడం సముచితం అనే నినాదంతో యూఎస్యే శంకర నేత్రాలయ అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యంలో ప్రచారోద్యమం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఆన్లైన్ సదస్సులో శ్రీపరిపూర్ణానంద స్వామి ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఘంటసాల ఒక కర్మయోగి, మహాజ్ఞాని, తపస్వి అని, ఆయన జీవితం ఒక తపస్సు అని శ్రీపరిపూర్ణానంద స్వామి అన్నారు. తానొక స్వామీజీనైనా మీరంతా చేస్తున్న ప్రయత్నాలకు నమస్కరిస్తున్నానని అన్నారు. ఒక తపస్వికి, జ్ఞానికి, కర్మయోగికి భారత్ రత్న ఇవ్వాలని మీరంతా చేస్తున్న కృషి ప్రశంసనీయం అని కొనియాడారు.
భారతరత్న అవార్డుకు ఘంటసాల పూర్తిగా అర్హులని చెప్పారు. ఆయన గొప్పతనాన్ని పంచుకున్నారు. ఒక అమరగాయకుడిగా, సంగీత దర్శకుడిగా పదివేలకు పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, తులు బాషల్లో పాటలు ఆలాపించారని గుర్తు చేశారు. పాటలతోపాటు పుష్ప విలాపం, కుంతీ విలాపం తదితర పలు ప్రైవేట్ ఆల్బమ్లు, దేశభక్తి గీతాలాపాన, వ్యాఖ్యానంతోపాటు ఆయన ఆలాపించిన భగవద్గీత ఇప్పటికి తెలుగువారి ఇండ్లలో మారుమోగుతున్నదన్నారు.
`అలాగే స్వీయ సంగీత దర్శకుడిగా 110కిపైగా సినిమాలకు సంగీత దర్శకత్వంతో ఆణిముత్యాలాంటి పాటలను, వాగ్గేయకారుడుగా పాటలను రచించారు. సంగీత స్వర కల్పన కూర్చడంతోపాటు తన అమృత గాత్రంతో ఆ పాటలకు జీవం పోశారు` అని శ్రీ పరిపూర్ణానంద స్వామి చెప్పారు. 15వ శతాబ్ధిలో అన్నమయ్య తరువాత తిరుపతి దేవస్థానం గర్భగుడిలో పాటలు పాడిన ఏకైక గంధర్వ గాయకుడు ఘంటసాల అని తెలిపారు.
వీటితోపాటు పిన్న వయస్సులోనే దేశంకోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడిగా 18 నెలల జైలు శిక్ష అనుభవించారని శ్రీపరిపూర్ణానంద స్వామి అన్నారు. ఆయన గొప్ప దేశభక్తుడని అని కొనియాడారు. ఘంటసాల గారికి భారతరత్న కోసం change.org లో నేను సంతకం చేస్తున్నాని చెపుతూ మీరంతా కూడా సంతకాల సేకరణను ఇంకా ఉదృతం చేయాలని కోరారు. 15 కోట్ల మంది తెలుగు వారి ఆకాంక్షని కేంద్ర పాలకులకు చేరేవరకు అందరు కలసి కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమానికి అమెరికా నుంచి గానకోకిల శారద ఆకనూరి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఘంటసాలకు భారతరత్న అవార్డు ఇవ్వడం సముచితం అన్న నినాదంతో యూఎస్ఏ శంకర నేత్రాలయ అధ్యక్షుడు బాల ఇందుర్తి ఇప్పటి వరకు 90కి పైగా టీవీ కార్యక్రమాలు నిర్వహించారు. తద్వారా ప్రపంచ నలుమూలల్లో ఉన్న తెలుగు సంస్థలను ఏకతాటిపైకి తీసుకొస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సదస్సులో అమెరికా నుంచి నాటా మాజీ అధ్యక్షుడు డాక్టర్ రాఘవ రెడ్డి గోసాల, నాట్స్ (NATS) అధ్యక్షుడు విజయ శేఖర్ అన్నే, ధర్మయోగి ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాంకుమార్ యడవల్లి, శంకర్ నేత్రాలయ బోర్డు సభ్యులు రమేష్ బాబు చాపరాల, నారాయణరెడ్డి ఇందుర్తి పాల్గొన్నారు. భారత్ నుంచి ఘంటసాల గాన చరిత సంకలనకర్త చల్లా సుబ్బారాయుడు, సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు తదితరులు పాల్గొన్నారు. సదస్సులో పాల్గొన్న అతిథులంతా మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి శ్రీ పరిపూర్ణానంద స్వామి పాల్గొనడం కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. దీన్ని మరింత ఉదృతం చేయడానికి తోడ్పాటు అందించారన్నారు. ఘంటసాల పాటలతో తమకున్న అభిమానం, వారి పాటల్లో మాధుర్యాన్ని గుర్తుచేసుకున్నారు. పలువురు మాట్లాడుతూ ఘంటసాలకు భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరం అని అన్నారు.
ఘంటసాలకు భారతరత్న ఇవ్వడం తెలుగువారికి ఆత్మ గౌరవం అని పలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు. ఘంటసాలను కేంద్ర ప్రభుత్వం తగిన రీతిన గుర్తించి భారతరత్న అవార్డుతో సత్కరించాలని అభ్యర్థించారు. విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలను కూడా ఏకతాటిపై తెచ్చి భారతరత్న వచ్చేవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు.ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంకాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికాలలోని పలు తెలుగు సంస్థలతో 93 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని నిర్వాహుకులు తెలిపారు.
ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ ప్రారంభించిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్యస్పందన లభిస్తున్నదని నిర్వాహుకులు తెలిపారు, వివరాలు మీ అందరికోసం: https://www.change.org/BharatRatnaforGhantasala