సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్- 2022లో అద్భుతంగా రాణించి టైటిల్ సాధించిన తెలుగు తేజం పీవీ సింధును కలిసిన సింగపూర్ తెలుగు సమాజం ప్రత్యేకంగా అభినందనలు తెలిపి సన్మానించింది. వరుస విజయాలతో దూసుకు పోతూ తన కెరీర్లోనే తొలి సూపర్ 500 టైటిల్తో పాటు ఈ ఏడాది మూడో టైటిల్ను సొంతం చేసుకున్న సింధును సింగపూర్లోని తెలుగు వారు అభినందించారు.
ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాచం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ.. సింధు భారతదేశంతో పాటు తెలుగువారందరిని గర్వపడేలా చేసిందని, భవిష్యత్ లో మరిన్ని కీర్తి శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. రానున్న కామన్ వెల్త్ మరియు వరల్డ్ ఛాంపియన్షిప్ గేమ్స్లో కూడా విజయం సాధించాలని కోరుకున్నారు.
తనను వ్యక్తిగతంగా కలిసి శుభాభినందనలు తెలిపిన సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గానికి సింధు కృతజ్ఞతలు తెలియజేసారు. తెలుగు సమాజం నిర్వహించే కార్యక్రమాలను తెలుసుకొని, సింగపూర్లో ఉంటున్న తెలుగు వారికి సమాజం చేస్తున్న సేవలను కొనియాడారు.
సింగపూర్ తెలుగు సమాజం జూలై 31 న నిర్వహించనున్న బ్యాట్మింటన్ టోర్నమెంట్లో పాల్గొననున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సమాజం ఆగస్టు 13న సింగపూర్లో ఉండే తెలుగు మహిళలకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న నారీ (లేడీస్ నైట్) కార్యక్రమాన్ని స్త్రీలు వినియోగించుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.