Sankranthi | శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో అంతర్జాల వేదికగా సింగపూర్ సంక్రాంతి శోభ కార్యక్రమం ఆద్యంతం అలరించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సింగపూర్లో నివాసం ఉంటున్న తెలుగువారందరూ ఆనందంగా పాల్గొన్నారు. తెలుగు సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. “సంక్రాంతి ప్రకృతి పండుగ అని, స్నేహ సంబంధాలు పెంచి ఆత్మీయతను పంచే పండుగ అని అన్నారు. విదేశాల్లో ఈ తరం పిల్లలను కూడా ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో కలుపుకుంటూ మన సాంప్రదాయ విలువలను వారికి తెలియజేసే విధంగా వివిధ పండుగలను నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంస్థ కృషిని అభినందించారు. సింగపూర్లో సంస్కృతీ సంప్రదాయాలు పరిరక్షణ చేసే దిశగా ఈ సంస్థ మరిన్ని కార్యక్రమాలను చేయాలని దీవించారు. ఆత్మీయ అతిథులుగా పాల్గొన్న సీనియర్ బీజేపీ నాయకులు, సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి, ప్రముఖ సినీ గేయ రచయిత భువనచంద్ర, వంశీ ఆర్ట్ థియేటర్స్ వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామరాజు పాల్గొని.. శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్లో తెలుగు సంస్కృతి కోసం చేస్తున్న సేవలను అభినందించారు. సింగపూర్లో సంగీత సాహిత్యాల్లో అపారమైన ప్రతిభ ఉన్నవారు ఉన్నారని.. వారందరినీ ఈ వేదిక ముఖంగా కలుసుకోవడం ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగపూర్కు చెందిన ‘స్వర లయ ఆర్ట్స్’ విద్యార్థులచే ప్రదర్శింపబడిన గొబ్బిళ్ల పాటలు, సంప్రదాయబద్ధమైన ఆటలు, ముగ్గులు, భోగి పళ్లు, హరిదాసు వేషధారణ అందరినీ ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. తమ కృషిని అభినందిస్తూ బండారు దత్తాత్రేయ, ఇతర ఆత్మీయులు అందించిన ఆశీస్సులు మరింత స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు.
ఈ సంక్రాంతి శోభ కార్యక్రమంలో రాధిక మంగిపూడి సభా నిర్వహణలో, విద్యాధరి కాపవరపు, సౌభాగ్య లక్ష్మీ తంగిరాల, షర్మిల చిత్రాడ, శేషు కుమారి యడవల్లి, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, కృష్ణ కాంతి, తదితర గాయనీమణులు చక్కటి సంక్రాంతి పాటలను ఆలపించారు. అలాగే సింగపూర్ సాహితీ ప్రతిభను కూడా నిరూపిస్తూ అపర్ణ గాడేపల్లి, సుబ్బు వి పాలకుర్తి, ఫణీష్ ఆత్మూరి, స్వాతి జంగా, రోజా రమణి ఓరుగంటి, కవిత కుందుర్తి, శైలజ శశి ఇందుర్తి, శాంతి తెల్లదేవరపల్లి తదితరులు సంక్రాంతి పండుగ విశిష్టతను వివరిస్తూ తెలుగు పద్యాలు, సంక్రాంతి కవితలు రచించి వినిపించారు. సంస్థ కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భారద్వాజ్, సుధాకర్ జొన్నాదులు, భాస్కర్ ఊలపల్లి, రాంబాబు పాతూరి తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొని తమ శుభాకాంక్షలు తెలియజేశారు. రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక సారథ్యంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి యూట్యూబ్ & ఫేస్బుక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు.