Rishi Sunak | బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ సోమవారం చరిత్ర సృష్టించారు. యావత్ భారతావని దీపావళి పండుగ సంబురాలు జరుపుకుంటుండగా బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ స్థానానికి పోటీ పడిన పెన్నీ మోర్డాంట్ వైదొలగడంతో బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తొలి భారత సంతతి నేతగా నిలిచారు. హిందూ భక్తుడైన రిషి సునాక్.. అధికార 357 మంది పార్టీ ఎంపీల్లో సగానికి పైగా ఎంపీల మద్దతు కూడగట్టుకున్నారు. ఎన్నికైన 45 రోజులకే ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో తిరిగి బ్రిటన్ ప్రధాని ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశారు. దీని ప్రకారం సోమవారం మధ్యాహ్నం రెండు గంటల్లోపు నామినేషన్ దాఖలు చేయాలని గడువు విధించారు. అయితే, కనీసం 100 మంది ఎంపీల మద్దతు ఉంటేనే బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడాల్సి ఉంటుంది. కేవలం 27 మంది ఎంపీల మద్దతు మాత్రమే లభించడంతో పెన్నీ మోర్డాంట్ పోటీ నుంచి వైదొలిగారు.
గడువు ముగిశాక 1922 ఇన్ఫ్లూయెన్షియల్ కమిటీ చైర్ సర్ గ్రహం బ్రాడీ.. లిజ్ ట్రస్ వారసుడిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ప్రధానిగా ఎన్నికైనట్లు ప్రకటించారు. దీంతో సునాక్ శిబిరంలో సంతోషకర వాతావరణం నెలకొంది. దీంతో ప్రధాని నివాసం లండన్లోని 10- డౌనింగ్ స్ట్రీట్లోకి అడుగు పెట్టనున్నారు. ఈనెల 28న బకింగ్హమ్ ప్యాలెస్లో ప్రధానిగా రిషి సునాక్తో కింగ్ చార్లెస్ ప్రమాణం చేయిస్తారు.
బోరిస్ జాన్సన్కు మద్దతుదారులుగా ఉన్న మాజీ హోంమంత్రి ప్రీతి పటేల్, కేంద్ర మంత్రులు జేమ్స్ క్లవర్లీ, నధీం జాహవీ తదితర టోరీ పార్టీలోని ప్రముఖ నేతలు రిషి సునాక్కు మద్దతు తెలిపారు. గత నెలలో లిజ్ ట్రస్ క్యాబినెట్ నుంచి రాజీనామా చేసిన భారత సంతతి మంత్రి ప్రీతి పటేల్ మాట్లాడుతూ టోరీలు రాజకీయ విభేదాలు పక్కన బెట్టి రిషి సునాక్ను ఎన్నుకున్నారని తెలిపారు. ఇటీవల ప్రధానిగా లిజ్ ట్రస్ రాజీనామా చేసినప్పటి నుంచి రిషి సునాక్ అత్యంత పాపులర్ అయ్యారు.