NTR | విలువల రాజకీయానికి నిజమైన నిర్వచనం ఎన్టీఆర్.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
`వీధి అరుగు, నార్వే` ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా 100 కి పైగా తెలుగు సాహిత్య సాంస్కతిక సంస్థల భాగస్వామ్యంతో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు కీ. శే. నందమూరి తారకరామారావు గారి శత వసంతోత్సవాలు ఆన్లైన్ వేదికగా శనివారం (మే 27, 2023) అపూర్వకంగా, అద్భుతంగా జరిగాయి. వందకి పైగా తెలుగు సంఘాల పరిచయ వేదిక పలు నక్షత్రాలను కలిపే పాలపుంతలా తోచిందని పలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు.
వక్తలు ఎన్టీఆర్ను ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్కు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఘనంగా జరుపుకున్న “శకపురుషుని శతవసంతాలు” కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ఇప్పటివరకు 25 నుంచి 30 వేల మంది వీక్షించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. `విలువలతో కూడిన రాజకీయాలకు నిజమైన నిర్వచనం ఎన్టీఆర్. ఆయన వ్యక్తిత్వం భావితరాలకు మార్గదర్శనం` అని దివంగత ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. తెలుగు భాష పరిరక్షణకు ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ పునరంకితం కావాలని వారు పిలుపునిచ్చారు.
తెలుగు వారి హృదయాలపై చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా పలు తెలుగు సంఘాలు భాగస్వామ్యం వహించటం అభినందనీయమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఉన్న ఎల్లలు లేని అభిమానానికి ఇది నిదర్శమన్నారు.
ఆత్మీయ అతిధి, ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ అద్భుతమైన ఈ కార్యక్రమం నిర్వహించడంతోపాటు తమను కూడా ఇందులో భాగం చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు.
ప్రముఖ చలనచిత్ర నటుడు మాగంటి మురళీమోహన్, ప్రముఖ నిర్మాత చలసాని అశ్వనీదత్, ఎన్టీఆర్ మనుమరాలు నారా బ్రాహ్మణితోపాటు కే లక్ష్మీనారాయణ, డాక్టర్ విజయభాస్కర్ దీర్ఘాశి, గుమ్మడి గోపాలకృష్ణ, డాక్టర్ శంకర నారాయణ తదితర ప్రముఖులు ప్రసంగించారు.
వీధిఅరుగు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం విజయవంతం కావడానికి 40 దేశాల తెలుగుసంస్థలు అందించిన సహకారం వెలకట్టలేనిది. వివిధసంస్థల నుంచి పలువురు మంది చిన్నారులు, పెద్దలు ఎన్టీఆర్ నటించిన సినిమాల నుండి పద్యాలు, పాటలు, నృత్యాలతో ఆహుతులను అలరించారు.
అంతర్జాలంలో అంతర్జాతీయంగా 14 గంటల పాటు నిర్విరామంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఎన్టీఆర్ గొప్పతనాన్ని ముందు తరాలకు తెలియజేసేందుకు వారధి కాగలదని వీధిఅరుగు వ్యవస్థాపకులు వెంకట్ తరిగోపుల పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి సుధాకర్ రావు కుదరవల్లి, విక్రమ్ సుఖవాసి, పావని రాగిపాని, నవీన్ సామ్రాట్ జలగడుగు, లక్ష్మణ్ వెన్నెపురెడ్డి, వై భార్గవ్, లక్ష్మి రాయవరపు, శిరీష తూనుగుంట్ల, రాజగోపాల్ మోహన్ ఆరేటి, అశోక్ కుమార్ పారా సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యమానికి తోడ్పాటు అందించిన ప్రసార మధ్యమ సంస్థలకు, మీడియా మిత్రులకు వీధి అరుగు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
చరిత్ర పుటల్లో ఎన్టీఆర్ పేరు స్వర్ణాక్షరాలతో నిలిపోయేలా అపూర్వంగా అద్భుతంగా నిర్వహించిన “శకపురుషుని శతవసంతాలు” అంతర్జాల కార్యక్రమంలో అందరికీ భాగస్వామ్యం కల్పించిన వెంకట్ తరిగోపులకు, ఆయన బృందానికి వివిధ సంస్థల అధినేతలు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని వీక్షించండి: