సింగపూర్ : భారతదేశంలో కొత్త రకం సింగపూర్ వేరియంట్ ఉందంటూ పలు వార్తా పత్రికలు, టీవీ ఛానళ్లలో వచ్చిన కథనాల్లో ఎలాంటి నిజంలేదని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. హిందూస్తాన్ టైమ్స్, ఎన్డీటీవీలు భారతదేశంలో సింగపూర్ కొత్త రకం వేరియంట్ ఉందంటూ తమ కథనాల్లో ఊటంకించాయి.
ఈ వ్యాసాలను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన అధికార ట్విటర్ ఖాతాలో పోస్టు చేసి కొత్త రకం వేరియంట్ పిల్లల్లో పెను ప్రభావం చూసే అకాశం ఉందని, దేశంలో మూడో వేవ్కు కారణం కావచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వీటిపై సందేహాలను నివృతి చేస్తూ సింగపూర్ వేరియంట్ ఉందంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేసింది.
‘‘నేను, బసిక ప్రశాంత్ రెడ్డి.. సింగపూర్లో గత 18 సంవత్సరాలు నివసిస్తున్నాను. ఇక్కడి తెలంగాణ కల్చరర్ సొసైటీ (సింగపూర్) కు ప్రధాన కార్యదర్శి సేవలు అందిస్తున్నా. ప్రస్తుతం మోనో క్లోనల్ యాంటీబాడీస్తో కొవిడ్ -19 చికిత్సను అభివృద్ధి చేస్తున్న ఇక్కడి బయోటెక్ కంపెనీలో క్వాలిటీ మేనేజర్గా సేవలు అందిస్తున్నా. సింగపూర్ కొత్త వేరియంట్కు సంబంధించి భారత ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో నిజం లేదు. కొత్త వేరియంట్కు సంబంధించి ఇక్కడ ఎలాంటి జన్యుక్రమాన్ని విశ్లేషించలేదు.
విదేశీ ప్రయాణికుల ద్వారా ఇక్కడ వ్యాపించిన బీ.1.617, ఇతర వేరియెంట్ల వ్యాప్తి తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తగా విద్యార్థులందరికీ ఇంటి నుంచే చదువుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆ మాటకొస్తే గతేడాది నుంచి ఇక్కడ పాఠశాలలు తెరిచే ఉన్నాయి.
సింగపూర్లో ఉన్న రకాన్ని ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’ గా భావించి అందరూ జాగ్రత్తగా ఉండాలని ఇక్కడి ప్రభుత్వం, అంటువ్యాధుల నిపుణులు సూచించారు. ఇక్కడ ఎలాంటి పూర్తిస్థాయి లాక్ డౌన్ లేదు. ఇండియాలో ఉంటున్న వారు సింగపూర్లో ఉంటున్న తమ బంధువుల ఆరోగ్యం గుర్తించి ఎలాంటి ఆందోళన చెందొద్దు’’ అని ఆయన కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.