హైదరాబాద్ : వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్, శుభోదయం గ్రూప్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో స్టార్ సింగర్ విజయలక్ష్మికి స్వర్ణ-వంశీ శుభోదయం మ్యూజికల్ అవార్డు-2021ను సీఎండీ శుభోదయం గ్రూప్ సీఎండీ లయన్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ కలపటపు బహూకరించారు. ఈ సందర్భంగా నేషనల్ బ్యాంకార్డ్ అధ్యక్షుడు ఇఫ్తెకార్ షరీఫ్ మాట్లాడుతూ ‘అమెరికా, యూకే, గల్ఫ్, మలేషియా, రష్యా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో పర్యటించి.. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళం, రాజస్థానీ, ఒరియా అనేక భాషల్లో పాటలు పాడి ప్రపంచ దేశాల్లోని సంగీత ప్రియులను ఓలలాడించారంటూ ప్రశంసించారు.
అమెరికా నుంచి ప్రముఖ గాయని శారద ఆకునూరి, సింగపూర్ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షుడు రత్నకుమార్ కవుటూరు, రాధికా మంగిపూడి, తెలుగు కళాసమితి ఖతార్ నుంచి అధ్యక్షుడు తాతాజీ ఉసిరికల పాల్గొని విజయలక్ష్మిని అభినందించారు. ప్రముఖగాయని సురేఖామూర్తి, శశికళా స్వామి వేదాల, వినోద్బాబు, గురు రామాచారి, డాక్టర్ బంటి, శ్రీకృష్ణ, వీకే దుర్గ, ప్రవీణ్ కొప్పుల, సుగుణ, శ్రీనివాస్, సుజారమణ, శారదా సాయి, కేఎస్ఆర్ మూర్తి మూర్తి, లలిత చెరుకూరి, శివశంకర్, కమలాశాస్త్రి, రేవతి, మహాభాష్యం చిత్తరంజన్, వీ హరి శ్రీనివాస్, చింతలపాటి సురేష్, శైలజ సుంకరపల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శుభోదయం చైర్మన్ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాషకు దోహదం చేసే కార్యక్రమాలకు అంతర్జాతీయంగా శుభోదయం గ్రూప్ సహకరిస్తుందన్నారు. ఐదు దశాబ్దాలుగా తన పాటల ద్వారా తెలుగు భాషకు ఎనలేని సేవలు చేస్తున్న విజయలక్ష్మికి ‘స్వర్ణ వంశీ’ శుభోదయం మ్యూజికల్ అవార్డు ప్రదానం చేసినందుకు తమ గ్రూప్ గర్విస్తున్నదన్నారు. వంశీ సంస్థ అధ్యక్షురాలు తెన్నేటి సుధ తాను రాసిన అభినందన ప్రతం చదివి విపించారు.
వంశీ సంస్థల వ్యవస్థాపకులు వంశీ రామరాజు మాట్లాడుతూ ఎందరో కళాకారుల చేయూత వల్ల వంశీ సంస్థ స్వర్ణోత్సవాలు జరుపుకోబోతున్నదని, ఐదు ఖండాల్లోని తెలుగు కళాకారులను ఈ సందర్భంగా అభినందించారు. విజయలక్ష్మి తాము నడుపుతున్న దివ్యాంగుల సహాయార్థం ఘంటసాల ఆరాధనోత్సవాలు, ఎప్పీ బాలు ఆరాధనోత్సవాల సభల్లో పాల్గొని ఎంతో సహకరించారని, ఆమె చేస్తున్న సాంఘిక, సంక్షేమ కృషిని కొనియాడారు. ఆన్లైన్ వేదిక జరిగిన కార్యక్రమాన్ని వంశీ ఆర్ట్ థియేటర్స్ అఫీషియల్, శుభోదయం, ‘ట్రైనెట్ లైవ్’ ప్రసారం చేశాయి.