అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో శంకరనేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యములో ఇప్పటివరకు 140 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా జులై 3న నిర్వహించిన జూమ్ కార్యక్రమంలో ఏపీ మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. ఘంటసాల పేరు వినపడగానే మన అందరికి ఒక మధురమైన పాట గుర్తుకు వస్తుందన్నారు. ఎన్నో మధురమైన పాటలు పాడి ఎంతోమందికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచిన ఘంటసాలను మనం మరోసారి గుర్తు చేసుకొనే అవకాశం వచ్చిందన్నారు. 100 సంవత్సరాల వసంతోత్సవం జరుగుతున్నవేళ… ఈ సందర్భంగా వారికి భారతరత్న ఇవ్వాలి అనేది ప్రతి తెలుగువాడి కోరిక అని ఆమె స్పష్టం చేశారు.
తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. ఘంటసాల అమర గాయకుడని ప్రశంసించారు. తనకైతే సాక్షాత్తు ఘంటసాల గారే కృష్ణుడికి భగవద్గీతని భోదించినట్టుగా ఉంటుందని, అది వింటున్నప్పుడల్లా ఒళ్ళు పులకరించి కృష్ణ పరమాత్ముడు సాక్షత్కరిస్తున్నట్టుగా ఉంటుందన్నారు. అంత అద్భుతంగా మనందరికీ భగవద్గీతని పాడి వినిపించారని, అందుకే వారు అమరగాయకుడు అయ్యారని కొనియాడారు. తెలుగు వారందరు ఏకతాటిపై వచ్చి ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మీరందరూ చేస్తున్న ప్రయత్నాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు భరణి తెలిపారు.
రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలనే ఒక నినాదంతో, ఆకాంక్షతో తలపెట్టిన ఈ కార్యక్రమములో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. చాలా మందికి మరణాంతరం భారతరత్న ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నామని, అలాంటి వాళ్ళలో ముందువరుసలో ఉండే వారు ఘంటసాల కూడా ఒకరని పేర్కొన్నారు.