NRI news | ప్రతి సంవత్సరం వందలాది మంది భారతీయులు వలస వెళ్తున్నారు. ఉన్నత విద్య, మంచి ఉద్యోగాలు, మెరుగైన జీవనశైలి మరెన్నో ఇతరత్రా కారణాలతో విదేశాల బాట పడుతున్నారు. ఈ ప్రక్రియలో తల్లితండ్రులను వదిలి దూరంగా ఉండటం, పిల్లల పెంపకంలో బాధ్యతలు, సామాజిక ఒంటరితనం, పని ఒత్తిడి కారనంగా తెలియని నిరాశ నిస్పృహలు, మానసిక ఆరోగ్య సమస్యలు రావడం సహజం. వీటి గురించి చర్చించేందుకు ‘వీధి అరుగు’ వేదిక ఆధ్వర్యంలో డిసెంబరు మాసాంతపు కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ‘ఆనందమయమైన జీవితం-మానవ సంబంధాలు’ అనే అంశంపై చర్చ జరిగింది.
ప్రతి వ్యక్తి యొక్క సమర్థత, ఆనందం, సంతృప్తిలో మానవ సంబంధాలు కీలక పాత్ర పోషిస్తాయని కవి, రచయిత, ఇంప్యాక్ట్ ట్రైనర్ నండూరి వెంకట సుబ్బారావు అన్నారు. మానవ సంబంధాలను మెరుగుపరచడానికి 5 పొరల క్రింద మన సంబంధాలను అధ్యయనం చేయాలని చెప్పారు. అవి స్వీయ సంబంధం, కుటుంబంతో సంబంధం, స్నేహితులతో సంబంధం, పని ప్రదేశంలో సంబంధాలు, సమాజంతో సంబంధాలని, ఈ 5 పొరలను అధ్యయనం చేయడం ద్వారా విభేదాలకు కారణాలు, వాటిని సామరస్యంగా పరిష్కరించే మార్గాలను కనుక్కోవచ్చునని తెలిపారు. ఒక బంధం వల్ల ఇతరులపై మీకు ఎలాంటి హక్కులు లభించవన్నారు. సంబంధాలు బాధ్యతలను మాత్రమే తెస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి డెన్మార్క్ నుంచి ప్రముఖ వ్యాఖ్యాత రాజ్ కుమార్ కలువల అనుసంధానకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు బోజెడ్ల, డాక్టర్ వీరంరాజు, డాక్టర్ లహరి సూరపనేని, రవిచంద్ర నాగభైరవ, సత్యనారాయణ కొక్కుల, రామకృష్ణ ఉయ్యురు, లక్ష్మణ్, డాక్టర్ విజయలక్ష్మి, వెంకట్, జగదీశ్, కే నరసింహులు, బాలాజీ యాదవ్, రవితేజ గుబ్బ, రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. పూర్తి కార్యక్రమాన్ని వీక్షించేందుకు https://www.youtube.com/watch?v=1wgoyPF5eW0 లో సంప్రదించగలరని నిర్వాహకులు కోరారు.