మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భద్రత ( KCRs Security ) పై ఎఫ్డీసీ మాజీ చైర్మన్, ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ( Anil Kurmachalam ) ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Government ) అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య విలువలు, ప్రతిపక్ష హక్కులు దెబ్బతింటున్నాయని, ఈ అంశాలపై తక్షణమే జోక్యం చేసుకోవా లని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ( President Murmu ) ఆయన లేఖ రాశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు, పరిపాలనా యంత్రాంగాన్ని ప్రతిపక్ష నేతలపై రాజకీయ కక్ష సాధింపులకు ఉపయోగిస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అమానుషంగా దాడులు చేయడంతో పాటు, అరెస్టులు, నిర్బంధాలు వంటి ఘటనలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. బీఆర్ఎస్ మహిళా నేతలు, మాజీ మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దౌర్జన్యాలు, దురుసు ప్రవర్తనపై కూడా నిష్పాక్షిక విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.
మహిళా ప్రజాప్రతినిధులు ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రజాస్వామ్య కార్యక్రమాల్లో పాల్గొనే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సస్పెన్షన్ల వెనుక ఉన్న పరిస్థితులను కూడా పరిశీలించాలని రాష్ట్రపతిని కోరారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై అధికార యంత్రాంగాన్ని ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.
కేసీఆర్ ఫాంహౌస్ పై దాడి కి ప్రయత్నించి, వచ్చిన బెదిరింపుల తీవ్రత, విశ్వసనీయ తపై తక్షణమే సమగ్ర అంచనా వేయాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రొఫెషనల్ థ్రెట్ అసెస్మెంట్ ఆధారంగా కేసీఆర్ గారికి తగిన భద్రత కల్పించాలని రాష్ట్రపతిని కోరారు.