డాక్టర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, అమెరికా సహకారంతో డాక్టర్ వంశీ రామరాజు ప్రచురించిన కొత్త ( కరోనా ) కథలు – 4 కథా సంకలనాన్ని ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 7 దేశాల్లోని 80 మంది రచయితలకు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ వంశీ రామరాజు అద్భుతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా భువనచంద్ర మాట్లాడుతూ.. రచయితలో మానవత్వంతో పాటు మాతృత్వం ఉండాలన్నారు. 80 మంది రచయితల కథలను ఒకే పుస్తకంలో ముద్రించడం గొప్ప విషయమన్నారు. ఈ పుస్తకాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేసిన శ్రీనివాస్ రెడ్డి, రామరాజుకు భువన చంద్ర ధన్యవాదాలు తెలిపారు. అనంతరం యండమూరి వీరేంద్ర నాథ్ మాట్లాడుతూ.. రచయితలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ పుస్తకంలో మొదటి కథ యండమూరి వీరేంద్రనాథ్ది కావడం విశేషమన్నారు. యండమూరి గొప్ప మానవతావాది అని రామరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీ కామేశ్వరి, డాక్టర్ కేవీ కృష్ణకుమారి, డాక్టర్ తెన్నేటి సుధాదేవి, అత్తలూరి విజయలక్ష్మి, ముక్తేవి భారతి, పొత్తూరి విజయలక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు.