హైదరాబాద్ : తెలంగాణ జాగృతి ఖతర్ బతుకమ్మ పోస్టర్ను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఖతర్లో మహా బతుకమ్మ వేడుకలను అక్టోబర్ 8న నిర్వహించనున్నట్లు తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షుడు నందిని అబ్బగౌని తెలిపారు. దోహలోని ఐసీసీ అశోక హాల్లో సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుకలు జరగనున్నాయి. కరోనా నిబంధనల మేరకు బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తామన్నారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఏ గడ్డపై ఉన్నా, ఎన్ని ఇబ్బందులెదురైనా స్వీయ సంస్కృతిపై మక్కువతో, మాతృభూమిపై మమకారంతో మన సంస్కృతిని, పండుగలను జరుపుకుంటున్న ప్రవాస తెలంగాణ వాసుల కృషిని ఆమె కొనియాడారు.
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, జాగృతి ఖతర్ కార్యవర్గ సభ్యులు స్వప్నా కేశా, శ్రీధర్ అబ్బగౌని, అభిలాష్ బండి తదితరులు పాల్గొన్నారు.