కాలిఫోర్నియా: శివపదం నృత్యరూపకం ‘కాశి సందర్శనం’ క్యాలిఫోర్నియా శాన్ హోసే నగరంలో కనులవిందుగా ప్రదర్శించారు. బ్రహ్మశ్రీ డాక్టర్ సామవేదం షణ్ముఖశర్మ తెలుగు, సంస్కృత భాషల్లో రచించిన వెయ్యికిపైగా శివపదాల నుంచి కాశి సందర్శనంలోని ఏకాదశ శివపదం కీర్తనలకు శివపదం పేరుతో నృత్యరూపకాన్ని తయారుచేశారు. కాశీలో వర్ణించే 11 సంస్కృత కీర్తనలను ఎంపిక చేసుకుని ప్రదర్శించిన నృత్యరూపకం ఎంతగానో ఆకట్టుకున్నది.
మల్లాది సూరిబాబు, మల్లాది శ్రీరాం, మల్లాది రవికుమార్, అనుముల యోష, గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ తదితరులు సంగీతం సమకూర్చి గానం చేశారు. కాశీలో వర్ణించే 11 సంస్కృత కీర్తనలను ఎంపిక చేసుకొని శాన్ హోసేకి చెందిన సునీత పెండెకంటి, భిదిష మొహంత్యె, మాధవి, చందన వేటురి, దీపన్విత సేనుగుప్త, డాక్టర్ వాసుదేవన్ అయ్యంగార్, రాజేశ్ చావలి, శిమ ఛొక్రబొర్థ్య్ గురువుల శిష్యబృందం 6 భారతీయ నృత్యాలు శైలీలో, 55 మంది ప్రవాస నృత్యకళాకారులు ఈ నృత్యరూపకాన్ని ప్రదర్శించారు.
ప్రతి నృత్యం ముందు సామవేదం షణ్ముఖ శర్మ ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయడం ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. 500 మందికి పైగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించి కాశి పట్టణాన్ని సందర్శినట్టుగా అనుభూతి పొందారు. వివిధ దేశాల నుంచి ఆన్లైన్ ద్వారా వీక్షించిన మరెందరో కాశి వెళ్ళిన ఆత్మానుభవంలో మైమరచిపోయారు.
కర్నాటక సంగీతానికి కధక్ ,ఒడిసి, హిందుస్తాని సంగీతానికి కూచిపూడి, భరతనాట్యం శైలిలో ప్రదర్శించడం అందరిని ఆకట్టుకున్నది. చివరగా జయ జయ జయ గంగే అనే శివపద కీర్తనతో నృత్య కారులు షణ్ముఖ శర్మతో పాటు నృత్యరూపకం సూత్రధారులు వాణి, రవిశంకర్ గుండ్లాపల్లి దంపతులు గంగా మాతకు హారతి ఇచ్చారు. కాశీలో నిత్యం జరిగే గంగా హారతి దృశ్యాన్ని అద్భుతంగా కళ్ళకి కట్టినట్టు చూపించి హాలంతా శివ మయం చేశారు.
కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి దివ్య ఆశీస్సులతో ప్రారంభించిన ‘నో యువర్ రూట్స్’ సంస్థ, అంతర్జాతీయ శివపదం నిర్వాహణ బృందం కలిసి శివపదం సృష్టికర్త సామవేదం షణ్ముఖశర్మకు ‘శివపద చింతామణి’ బిరుదును ప్రదానం చేశారు. అమెరికాలో కాశిని చూపించిన వాణి గుండ్లాపల్లిని ‘శివపదాంకిత’ ప్రశంసా బిరుదుతో ఋషిపీఠం తరుపున ఘనంగా సత్కరించారు.