న్యూఢిల్లీ : టొరంటోలో జరిగిన కాల్పుల ఘటనలో 21 ఏండ్ల భారత విద్యార్ధి మరణించడం పట్ల విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఏప్రిల్ 7న టొరంటోలోని సబ్వే స్టేషన్ ఎంట్రన్స్ వద్ద జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన కార్తీక్ వాసుదేవ్ మరణించాడని టొరంటో పోలీస్ సర్వీస్ తెలిపింది. శరీరంలో పలు చోట్ల కాల్పుల గాయాలైన వాసుదేవ్ను స్దానిక పారామెడిక్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు వెల్లడించారు.
టొరంటోలో కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన భారత విద్యార్ధి మరణించిన ఉదంతం తమను తీవ్రంగా కలిచివేసిందని, ఘటనపై మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్ధి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని మంత్రి ట్వీట్ చేశారు. కాల్పుల ఘటన నేపధ్యంలో ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న సాక్షుల కోసం ఆరా తీస్తున్నామని టొరంటో పోలీసులు తెలిపారు.
కెమెరా ఫుటేజ్ను పరిశీలించి దర్యాప్తును ముమ్మరం చేశారు. కాగా, టొరంటోలో జరిగిన కాల్పుల ఘటనలో భారత విద్యార్ధి కార్తీక్ వాసుదేవ్ మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని టొరంటోలో భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం ట్వీట్ చేసింది. బాధిత విద్యార్ధి కుటుంబంతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని, భౌతిక కాయాన్ని తరలించేందుకు అవసరమైన సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.