Dubai Court | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని ఒక మెడికల్ కంపెనీ యాజమాన్యం గతేడాది తన పార్టనర్కు డబ్బు ట్రాన్స్ఫర్ చేసింది. కానీ అనుకోకుండా జరిగిన పొరపాటు వల్ల.. భారతీయుడి ఖాతాలో రూ.1.28 కోట్లు (5.70 లక్షల యూఏఈ దిరామ్) జమ అయ్యాయి. అలా తన ఖాతాలో డబ్బు డిపాజిట్ కావడంతోనే ఖర్చు చేయడం ప్రారంభించాడు. పొరపాటు గుర్తించిన సంస్థ.. బ్యాంకు సహకారంతో తమ డబ్బు చెల్లించాలని ఆ వ్యక్తిని కోరింది. కానీ సదరు వ్యక్తి ససేమిరా అన్నాడు. దీనిపై దుబాయిలోని ఏఐ రఫా పోలీసులకు సదరు మెడికల్ సంస్థ ఫిర్యాదు చేసింది. పోలీసులు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేయడంతోపాటు ఆ బ్యాంకు ఖాతా నిలిపేశారు.
గత ఏడాది అక్టోబర్లో జరిగిన ఈ ఘటనపై దుబాయి క్రిమినల్ కోర్టు తీర్పు చెప్పింది. ఆ వ్యక్తిపై జరిమాన విధించింది. జరిమాన రూపంలో ఆ నగదు చెల్లించాలని ఆదేశించింది. అంతే కాదు.. నెల రోజుల జైలుశిక్ష కూడా విధించింది. జైలు శిక్ష పూర్తి కాగానే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. కోర్టు విచారణలో తన ఖాతాలో ఆ డబ్బు డిపాజిట్ అయిన మాట నిజమేనని ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు. ఆ డబ్బు తన ఖర్చులకు వాడుకున్నానని తెలిపాడు. డబ్బు ఇవ్వమని కోరినా.. అది వారిదేనని నమ్మకం కుదరలేదని కోర్టు విచారణలో చెప్పాడు. అయితే మొత్తం సొమ్ము అతని ఖాతాలో ఉందా.. లేదా.. అన్న సంగతి తెలియరాలేదు. తీర్పుపై సదరు భారతీయుడు దాఖలు చేసిన అప్పీల్ వచ్చే వారం విచారణకు రానున్నదని సమాచారం.