Global Shiva Padam |ఋషిపీఠం ఆధ్వర్యంలో మూడవ శివపద అంతర్జాతీయ అంతర్జాల పాటల పోటీలు ఈ నెల 12,13, 14 తేదీల్లో యూట్యూబ్ వేదికగాగా నిర్వహించారు. “శివపదాంకిత వాణి, గుండ్లపల్లి బృందం, వారణాసి నాగసంపత్, శ్రీకాంత్ వడ్లమాని, శ్రీనివాస్ మేడూరు సహకారంతో ఈ పాటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న చిన్నారులు, పెద్దల పాటల ఆలాపనను విన్నారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంత మంది చిన్నారులు, పెద్దలూ అంతా భావానికి ప్రాధాన్యం ఇస్తూ వందల కొద్దీ శివ పదాలు పాడటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. పోటీల్లో పాల్గొన్న వారికి శివాశీస్సులు అందజేశారు. మహా దేవుడైన సాంబసదాశివునికి భావస్వరాంజలులు శివపదాలు. సామవేదం షణ్ముఖ శర్మ దాదాపు 1100కి పైగా శివపద గీతాలు అత్యద్భుతంగా రచించారు.
ఈ పోటీలు ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు `గ్లోబల్ శివపదం టీం`, న్యాయనిర్ణేతలను షణ్ముఖ శర్మ అభినందించి, ఆశీర్వదించారు. ఋషిపీఠం తరఫున పూర్ణ సహకారాలు అందించిన మారేపల్లి సూర్యనారాయణ, విద్యుత్ అంతరాయం ఉన్నా కార్యక్రమంలో ఎటువంటి అంతరాయం రాకుండా మెరుగైన సాంకేతిక సహకారం అందించిన తోలేటి వెంకట పవన్కు ప్రత్యేక ఆశీస్సులు అందించారు.
ఐదు ఖండాలలోని వివిధ దేశాలనుంచి 300 మంది ఔత్సాహికులు ఈ పాటల పోటీల్లో పాల్గొన్నారు. 17 మంది సంగీత గురువులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. భారత్ నుంచి శారదా సుబ్రమణియమ్ , తులసీ విశ్వనాథ్, పద్మ త్యాగరాజన్, పెద్దాడ సూర్యకుమారి, విష్ణుప్రియ భరధ్వాజ్, విద్యా భారతి, రాధికా కృష్ణ, శ్రీదేవి దేవులపల్లి, లక్ష్మి మూర్తి, మోహన కృష్ణ, ప్రతిమ, అమెరికా నుండి పావని మల్లా జ్యోస్యుల, లక్ష్మి కొలవెన్ను, అనీల కుమార్ గరిమెళ్ళ, లలిత రాంపల్లి, ప్రభల శ్రీనివాస్, సింగపూర్ నుండి శేషు కుమారి యడవల్లి న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు.
ఈ పాటల పోటీల్లో పాల్గొన్న వారి వయస్సుల వారిగా `ఉపమన్యు `, `మార్కండేయ`, `భక్త కన్నప్ప`, `నత్కీర`, `పుష్పదంత` అనే ఐదు విభాగాలుగా నిర్వహించారు. ఎన్నారైలైన పిల్లలు కూడా సంప్రదాయ బద్ధ వస్త్రధారణతో, స్పష్టమైన ఉఛ్చారణతో శృతి లయబద్ధంగా శివపదాలను అద్భుతంగా, వీనుల విందుగా పాడారు. అద్యంత శివమయంగా సాగిన ఈ కార్యక్రమం శుక్రవారం భారత్లో మొదలై ఆదివారం ముగిసింది.