* ఉక్రెయిన్ యుద్ధంతో వైద్యవిద్యలో అనిశ్చితి
* వారిని ఉజ్బెకిస్థాన్ యూనివర్సిటీలో చేర్పించిన నియో సంస్థ
* దిగ్విజయంగా ఎంబీబీఎస్ పూర్తిచేసిన 86 మంది అమ్మాయిలు
* ఏఐజీ ఆస్పత్రిలో కన్నుల పండువగా గ్రాడ్యుయేషన్ సెర్మనీ
* ముఖ్య అతిథిగా భారత్లో ఉజ్బెకిస్థాన్ రాయబారి సర్దోర్ రుస్తంబేవ్
వాళ్లంతా కోటి ఆశలతో ఎంబీబీఎస్ చదువుకోవాలని ఉక్రెయన్ వెళ్లారు. మొదట్లో అంతా బాగానే ఉంది. అంతలోనే యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. వాళ్ల భవిష్యత్తు అంధకారంగా మారింది. ప్రాణాలతో స్వదేశం చేరుకోవడమే పెద్ద సవాలు అనుకున్నారు. ఎలాగోలా తిరిగొచ్చారు. కానీ, చదువు కొనసాగించడం ఎలా? అనుకుంటున్నప్పుడు సరిగ్గా అలాంటి సమయంలో నియో ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ వారిని ఆదుకుంది. భారత ప్రభుత్వంతో, ఎన్ఎంసీతో, ఉజ్బెకిస్థాన్ విదేశీ మంత్రిత్వశాఖ, అక్కడి వైద్య కళాశాలలతో సంప్రదించి, 210 మందిని తమ ఎంబీబీఎస్ చదువు ఉజ్బెకిస్థాన్లో పూర్తిచేసేందుకు పంపింది. వారిలో 86 మంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్లంతా ఇంతటి సంక్లిష్ట పరిస్థితులను అధిగమించి, మానసిక ఒత్తిడిని జయించి ఎంబీబీఎస్ పూర్తిచేశారు. వాళ్లందరికీ నగరంలోని ప్రధాన దవాఖానలలో ఒకటైన ఏఐజీ ఆస్పత్రిలో కన్నులపండువగా జరిగిన కార్యక్రమంలో పట్టాలు పంపిణీ చేశారు. వీళ్లలో 110 మంది ఎఫ్ఎంజీఈ పరీక్ష రాయగా, అందులో 81 మంది తొలిసారే ఉత్తీర్ణులయ్యారు.
ఈ కార్యక్రమంలో నియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎండీ, ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖలో భారతీయ ప్రతినిధి డాక్టర్ దివ్యా రాజ్రెడ్డి మాట్లాడుతూ.. `ఉక్రెయిన్-రష్యా యుద్ధం సమయం విద్యార్థులకు నిజంగా అతిపెద్ద పరీక్షా కాలం. ఇంత ట్రామా తర్వాత మళ్లీ వాళ్లకు అసలు చదువు పూర్తవుతుందా, డిగ్రీలు చేతికి వస్తాయా లేవా, అసలు ప్రాణాలు నిలబడతాయా లేవా అన్నది కూడా అనుమానంగానే ఉండేది. ఆ సమయంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ)ని సంప్రదించి, వాళ్లను ఉజ్బెకిస్థాన్లో చదివించేందుకు అనుమతులు తీసుకుని చదివించాం. అప్పుడు వాళ్ల చదువు కొనసాగేలా ఒప్పందాలు చేయించాం. రెండు దేశాల ప్రభుత్వాల సహకారంతోనే సాధించాం. విద్యార్థులంతా తమ సెకండ్ సెమిస్టర్లో ఉండగా యుద్ధం మొదలైంది. దాంతో వాళ్లు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ఆపరేషన్ గంగతో చేరుకున్నారు. తిరిగి వచ్చాక చదువు పరిస్థితి ఏంటన్న ప్రశ్న వచ్చింది. అప్పుడు నియో కన్సల్టెన్సీ ప్రయత్నాలతో ఎన్ఎంసీ తాత్కాలికంగా ఆన్లైన్ చదువుకు పర్మిషన్ ఇచ్చింది. అలా 2-3 నెలలు చదివారు. తర్వాత తిరిగి ఉక్రెయిన్కు వెళ్లాలి. కానీ అప్పటికీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాంతో ఎన్ఎంసీ విదేశీ మంత్రిత్వశాఖతో సంప్రదించి, వేరే దేశానికి పంపాలని 2022 సెప్టెంబర్ 9న ఒక సూచన ఇచ్చింది. అప్పుడు నియోసంస్థ, కేంద్ర ప్రభుత్వం, అన్ని మంత్రిత్వశాఖల ప్రయత్నాలతో ఉజ్బెకిస్థాన్లో వాళ్లు తమ చదువు కొనసాగించేందుకు అనుమతులు వచ్చాయి. మిగిలిన చదువులన్నీ ఆన్లైన్లో అయినా చదవచ్చు గానీ, వైద్యవిద్య అలాకాదు. ఇందులో ప్రాక్టికల్ అనుభవం ముఖ్యం. సగంలో ఆపేసిన తమ చదువును ఆఫ్లైన్లో నేరుగా ఉజ్బెకిస్థాన్లోని బుఖారా స్టేట్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో కొనసాగించడంతో విద్యార్థులకు పూర్తి స్థాయి వైద్యవిద్య అందినట్లయింది. అందుకే 110 మంది ఎఫ్ఎంజీఈ రాయగా, 81 మంది పూర్తిచేశారు. అందులోనూ 34 మంది అమ్మాయిలే ఉన్నారు” అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారత్లో ఉబ్జెకిస్థాన్ రాయబారి సర్దోర్ రుస్తంబేవ్ మాట్లాడుతూ, “విద్యార్థులు చక్కగా చదివి, డిగ్రీ పూర్తిచేసుకున్నందుకు ఎంతో ఆనందపడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక విద్యార్థి భవిష్యత్ మధ్యలో ఆగిపోవడం చాలా పెద్ద సమస్య. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు అపారమైన కృషిచేసి, అడ్డంకులు అన్నింటినీ ఎదుర్కొని మరీ విజయం సాధించారు. వాళ్ల విజయంలో మా దేశం పాత్ర ఉండటం మా అదృష్టం. నియో సంస్థ కూడా విద్యార్థులకు ముందుండి ఉక్రెయిన్ నుంచి పిలిపించి, ఉబ్జెకిస్థాన్ వరకు పంపినందుకు వాళ్లను అభినందిస్తున్నాను. భారత ప్రభుత్వం విద్యార్థులను యుద్ధ సమయంలో తిరిగి తీసుకురావడం ప్రశంసనీయం` అని అభినందించారు.
ఎన్ఎంసీ సూచనల మేరకు మొత్తం 210 మంది విద్యార్థులకు వాళ్లు తమ ఎంబీబీఎస్ మొదలుపెట్టిన ఉక్రెయిన్లోని జపోరిఝియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుంచే పట్టాలు పొందడం గమనార్హం. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్, ఏఐజీ ఆస్పత్రి చైర్మన్, పద్మభూషణ్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి, ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా సంఘం చైర్మన్ పీ విజయబాబు, నియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎండీ, ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖలో భారతీయ ప్రతినిధి డాక్టర్ దివ్యా రాజ్రెడ్డి, ఉజ్బెకిస్థాన్ ఎంబసీ ఫస్ట్ సెక్రటరీ ఎస్. సుయరొవ్, ఉజ్బెకిస్థాన్ ఎంబసీ కౌన్సెలర్ ఐ. సొలియెవ్, నియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సీఈఓ డాక్టర్ బీవీకే రాజ్, ఏఐజీ ఆస్పత్రి వైస్ ప్రెసిడెంట్ సందీప్ సాహూ తదితరులు పాల్గొన్నారు.