హైదరాబాద్: అమర గాయకుడు, పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా 366 రోజులపాటు నిర్వహించతలపెట్టిన ఘంటసాల స్వరరాగ మహాయాగం నిరాటంకంగా 50వ రోజుకు చేరుకుంది. ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్, శుభోదయం గ్రూప్స్ సంయుక్తంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నాయి.
2021 డిసెంబర్ 4న ప్రారంభమై దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటికే భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, హాంగ్కాంగ్, ఖతార్, బహ్రెయిన్, ఒమన్, అమెరికా మొదలైన దేశాల నుంచి గాయనీగాయకులు పాల్గొని ఘంటసాల గీతాలను ఆలపించారు. 50వ రోజు సందర్భంగా శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు ఘంటసాల మందిరంలో దీపారాధన చేసి కార్యక్రమం ప్రారంభించారు.
విజయనగరం నుంచి లలితా అలమేలు మంగ, జడ్చర్ల నుంచి శైలజామూర్తి ఘంటసాల స్వరం నుంచి జాలువారిన చక్కటి వైవిధ్యభరితమైన పాటలను ఎంచుకుని ఆలపించారు. రాధిక మంగిపూడి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సింగపూర్ నుంచి కవుటూరు రత్నకుమార్ అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. శుభోదయం మీడియా ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.