Venkaiah Naidu | అమ్మ భాషలోని కమ్మదనాన్ని, మనవైన సంస్కృతి సంప్రదాయాలను రాబోయే తరాలకు అందించాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. మాతృభాష, మాతృభూమి, మాతృదేశాన్ని మించిన ఆస్తి, అస్తిత్వం వేరే లేవని స్పష్టం చేశారు. తానా మాజీ అధ్యక్షులు సతీశ్ వేమన ఆధ్వర్యంలో అమెరికాలోని వాషింగ్టన్లో వెంకయ్య నాయుడితో 28 ప్రవాస సంఘాల ఐక్య వేదిక ఆత్మీయ సమావేశం జరిగింది. బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం సహకారంతో వందలాది మంది ప్రవాసీయుల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో వెంకయ్య నాయుడు తమ అమూల్యమైన సందేశాన్ని అందించారు.
భిన్నత్వంలో ఏకత్వానికి భారతదేశం పరిపూర్ణ నిర్వచనమని వెంకయ్య నాయుడు అన్నారు. ఎన్నో దశాబ్దాల నుంచి ప్రజాస్వామ్యయుతంగా అందరూ కలిసి మెలిసి ఐక్యతతో.. ప్రగతిశీల దేశాభ్యుదయానికి చేయూత అందించడమే భారతీయతకు నిర్వచనమని పేర్కొన్నారు. దేశ భద్రత, జాతీయభావాలతో ప్రజలంతా నడుచుకోవాలని సూచించారు. దేశం కానీ దేశంలో వృత్తి రీత్యా కస్టపడి, పురోగతి సాధించాలని అకాంక్షించారు. మాతృభాష, మాతృభూమి, మాతృ దేశాన్ని మించిన ఆస్తి, అస్తిత్వం లేవన్నారు. అమ్మ భాషలోని కమ్మ దనాన్ని, మనవైన సంస్కృతీ, సంప్రదాయాలను రాబోయే తరాలకు సైతం అందించాలని పిలుపునిచ్చారు. మన కట్టు, బొట్టు, బాష, యాస వదులుకోవాల్సి అవసరం లేదని స్పష్టం చేశారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొంటూ, మానవీయ విలువలను కాపాడుకుంటూ ..సామాజిక బాధ్యతతో నడచుకోవటమే సనాతన జీవన విధానమని.. ఆ ధర్మాన్నే అందరూ పాటించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తానా మాజీ అధక్షులు సతీశ్ వేమన, ప్రసాద్ అడపా, కృష్ణ లామ్, సునీల్ సింగ్, కృపా సింగ్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, యాష్ బొద్దులూరి, భాను మాగులూరి, రవి అడుసుమిల్లి, సుధీర్ కొమ్మి, శ్రీనివాస్ గంగా, సుధా పాలడుగు, శ్రీవిద్య పలు సంఘాల ప్రతినిధులు, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.