హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో ఎవరు ఏదైనా పార్టీలో చేరొచ్చని అలాగే ఈటల రాజేందర్ కూడా వారికి నచ్చిన పార్టీలో చేరొచ్చు. కానీ అక్కడి నాయకుల మెప్పు కోసం రాజకీయ జీవితమిచ్చిన టీఆర్ఎస్ను విమర్శించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ఓ ప్రకటనలో తెలిపారు.
నిన్నటి దాకా ఆరోగ్యమంత్రిగా పని చేసిన ఈటల కేంద్రంలో పరిపాలన చేస్తున్న బీజేపీ ప్రభుత్వం కరోనా సందర్భంగా ప్రజలను గాలికి వదిలేసి, దాని కట్టడిలో విఫలమైన సంగతి అందరి కంటే ఎక్కువ తనకే తెలుసున్నారు. దేశమంతా బీజేపీని విమర్శిస్తున్నారు. దేశ ప్రజలు ప్రధానమంత్రి రాజీనామాను కోరుతుంటే మీకేమో బీజేపీ గొప్పగా కనబడడమేంటో విచిత్రంగా ఉందన్నారు.
మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ వ్యక్తిగత ఆస్తుల రక్షణ కోసం ప్రజల్ని పట్టించుకోని పార్టీలో చేరడంతో ప్రజలకు మీ నిజస్వరూపం అర్థమైందన్నారు.
నిన్న ఢిల్లీలో మీకు ఎంతటి ఆత్మగౌరవం లభించిందో ప్రజలంతా గమనించారు. మంత్రులని, ఎమ్మల్యేలని ఆత్మవిమర్శచేసుకోమనడం కాదు. ఢిల్లీ పోయి వచ్చినంక మీరు ఆత్మగౌరవం చేసుకోండి. ఆత్మగౌరవం పెరిగిందా తగ్గిందో అర్థమవుతుందన్నారు. ఎన్నారై శాఖ నుంచి గ్రామ కార్యకర్త వరకు హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పని చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.