ప్రముఖ గాయకుడు ఘంటసాల శతజయంతి ఉత్సవాలు, సంక్రాంతి సంబరాలను జీడబ్ల్యూటీసీఎస్( గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం) ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతిని వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ప్రముఖ సినీనటి జమున, కళాతపస్వి కె.విశ్వనాథ్, నేపథ్య గాయని వాణి జయరాం మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి మృతి తెలుగుజాతికి, సినీపరిశ్రమకు తీరని లోటని జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు.తెలుగు సంగీత సామ్రాజ్యానికి రారాజు ఘంటసాలని కొనియాడారు.
సినీవినీలాకశంలో ధృవతారగా వెలుగొందారని ఆయన ఆలపించిన భగవద్గీత నభూతో నభవిష్యత్ అని కొనియాడారు. అలాంటి మహనీయుని శతజయంతి ఉత్సవాలు జరుపుకునే అవకాశం రావడం అదృష్టమని అన్నారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో జీడబ్ల్యూటీసీఎస్ అనేక సేవా, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను నిర్వహించిందని పేర్కొన్నారు. ‘ సాంస్కృతిక కార్యక్రమాలు మానవ సంబంధాలకు వేదిక. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడ అందరం కలుసుకుని ఈ పండుగను నిర్వహించుకోవడం సంతోషంగా ’ఉందన్నారు.
ప్రముఖ సినిమా దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోతున్నా తరుణంలో జీడబ్ల్యూటీసీఎస్ కొనసాగిస్తుండటం అభినందనీయమని అన్నారు. ఘంటసాల శతజయంతి ఉత్సవాలు లాంటివి సినిమా వాళ్లుగా మేం చేయలేనందుకు సిగ్గుపడుతున్నాం. ఒక జాతి అస్థిత్వాన్ని, ప్రత్యేకతను చాటిచెప్పేది మాతృభాషేనని గుర్తుంచుకోవాలని’ సూచించారు.
భారత రాయబార కార్యాలయ ఉన్నతాధికారి రవి కోట మాట్లాడుతూ సంక్రాంతి అంటే తెలుగు సంస్కృతిని, పల్లె క్రాంతిని దర్శించుకోవడమని అభివర్ణించారు.మన్నవ సుబ్బారావు,డాక్టర్ ముల్పూరి వెంకట్రావు,తానా బోర్డు మాజీ అధ్యక్షులు నరేన్ కొడాలి, అనిల్ ఉప్పలపాటి తదితరులు మాట్లాడారు.
సంక్రాంతి శోభ ఉట్టిపడేలా రంగవల్లులు, ముగ్గులపోటీలు, పెళ్లిభోజనాలను తలపించేలా తాంబూలంతో కూడిన సహపంక్తి భోజనాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.తానా పూర్వాధ్యక్షులు సతీశ్ వేమన ఫోన్ ద్వారా సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంస్థ పూర్వాధ్యక్షులు సత్యనారాయణ మన్నె, రవి గవిరినేని, సాయిసుధ పాలడుగు, కిషోర్ తంగేటి, జీడబ్ల్యూటీసీఎస్ కార్యవర్గ సభ్యులు సుశాంత్ మన్నె, విజయ్ అట్లూరి, సుష్మ అమృతలూరి, కార్తీక్ కోమటి, రవి అడుసుమిల్లి, శ్రీవిద్య సోమ, భాను మాగులూరి, యాష్ బొద్దులూరి, చంద్ర మలావతు, రాజేష్ కాసరనేని, ఉమాకాంత్ రఘుపతి, ఫణి తాళ్లూరి, శ్రీనివాస్ గంగ, ప్రవీణ్ కొండక, పాల్గొన్న ఇతర ప్రముఖులు రమాకాంత్ కోయ, రామ్ చౌదరి ఉప్పుటూరి, విజయ్ గుడిసేవ, సాయి బొల్లినేని పాల్గొన్నారు.