హైదరాబాద్ : మహిళ రిజర్వేషన్ బిల్లు(Womens Reservation Bill) కోసం జాగృతి అధ్యక్షురాలు , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Mlc Kavitha)చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి మద్దతు తెలుపాలని కోరుతూ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం విదేశాల్లో ప్రచారం మొదలు పెట్టింది . ఇందులో భాగంగా బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల, బీఆర్ఎస్ ఆస్ట్రేలియా మహిళా వింగ్ అధ్యక్షురాలు సంగీత ధూపాటి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా (Australia)సిడ్నీ లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రచారాన్ని ప్రారంభించారు.
మహిళ రిజర్వేషన్ బిల్లు కోసం చేపట్టిన ఆందోళనకు మద్దతుగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ఆర్ఐ లు సహకరించాలని తొలిసారిగా ఆస్ట్రేలియా లో ప్రచారం ప్రారంభించామని మహేశ్ బిగాల వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు తమ మద్దతు తెలపాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ కవిత తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల విశిష్టతను ఖండాంతరాలకు వ్యాప్తిచెందేలా కృషిచేశారని ఆయన పేర్కొన్నారు.
నాడు హైదరాబాద్ లాంటి పట్టణాలు, విదేశాల్లో ఆత్మన్యూనతకు గురైన బతుకమ్మ (Batukamma)పండుగకు నేడు ఆయా దేశాలు బతుకమ్మ పండగను అధికారికంగా నిర్వహించేస్థాయికి తీసుకొచ్చారని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దేశవ్యాప్తంగా మహిళలను ఐక్యం చేసి బిల్లును సాధిస్తారని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు. సిడ్నీ లో జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గిరి రాపోలు, కన్వీనర్ రవిశంకర్ ధూపాటి ,లివింగ్స్టన్ చెట్టిపల్లి, అమ్రీన్, గుల్షన్ ఆరా, స్వప్న నెల్లీ, పరశురామ్ , అజాజ్, ఇస్మాయిల్, చిరాన్ పురంశెట్టి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.