హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తెలంగాణ (Telangana) అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఖచ్చితంగా 100 సీట్లు గెలవడం ఖాయమని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ (BRS NRI Kuwait) అధ్యక్షురాలు అభిలాష గొడిశాల (Abhilasha Godishala) అన్నారు. కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్కు ముందే అభ్యర్థులను ప్రకటించడంతోపాటు బీఆర్ఎస్ మానిఫెస్టోని కూడా ప్రజల ముందుంచి ప్రచారంలో రేసుగుర్రంలా దూసుకుపోతున్నారని తెలిపారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితుల్లో ఉన్నాయని ఎద్దేవాచేశారు. అలాగే అర్హత ఉన్న అభ్యర్థులు కూడా ఢిల్లీ గులాంలా ఆదేశాలకోసం వేచి చూస్తున్నారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని, దేశానికే ఆదర్శమన్నారు. ఈ మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు కావడం పక్కా అని చెప్పారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం సరికొత్త పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని, సీఎం కేసీఆర్ పథకాల వల్ల తెలంగాణ ప్రగతిపథంలో నడుస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా కువైట్ నుంచి సోషల్ మీడియా, కాల్ క్యాంపెయిన్ ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని పేర్కొన్నారు.