హైదరాబాద్ : తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(TPAD) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. ఎనిమిదేండ్లలో ఈ బ్లడ్ డోనేషన్ క్యాంపు నిర్వహించడం ఇది పదోసారి. ఇక కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత సంవత్సరానికి రెండు సార్లు బ్లడ్ డోనేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. తాజాగా నిర్వహించిన బ్లడ్ క్యాంపులో 69 మంది రక్తదానం చేశారు. 52 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. రక్తాన్ని కార్టర్ బ్లడ్ కేర్కు అందించినట్లు పేర్కొన్నారు.
తాజాగా సేకరించిన 52 యూనిట్ల రక్తంతో దాదాపు 10 మందికి గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు లేదా, 17 మందికి రక్త మార్పిడి చేయడానికి సరిపోతుందన్నారు. రక్తదానం చేసిన వారికి భోజన ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా వారిని అభినందించి బ్లాంకెట్లను బహుమతిగా అందజేశారు.
రక్తదాన శిభిరం విజయవంతం కావడానికి సహకరించిన రఘువీర బండారు, ఉమా బండారుతోపాటు వలంటీర్లకు, కార్టర్ బ్లడ్ కేర్ టెక్నీషియన్లకు ఈ సందర్భంగా నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాయత్రి గిరి, చక్రీ నారా, అజయ్ రెడ్డి(ఎఫ్సీ చైర్), రమణ లష్కర్(ప్రెసిడెంట్), ఇంద్రాని పంచెరుపుల(బీఓటీ), పాండు పాల్వే(కోఆర్డినేటర్) తదితర సభ్యులు పాల్గొన్నారు.