హైదరాబాద్ : ఈ నెల 30వ తేదీన మెగా బతుకమ్మ సంబురాలను ఖతర్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని తెలిపారు. ఈ బతుకమ్మ సంబురాలకు సంబంధించిన పోస్టర్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు ఏ గడ్డపై ఉన్నా, ఎన్ని ఇబ్బందులెదురైనా స్వీయ సంస్కృతిపై మక్కువతో, మాతృభూమిపై మమకారంతో, మన సంస్కృతిని, పండుగలను జరుపుకుంటున్న ప్రవాసుల కృషిని ఆమె కొనియాడారు.
దోహలోని లయోలా ఇంటర్నేషనల్ స్కూల్లో సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు నందిని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఖతర్లోని అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు.
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, జాగృతి ఖతర్ సభ్యులు సుధ శ్రీ రామోజు, మమత దుర్గంతో పాటు, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, యూరోప్, న్యూజిలాండ్, సౌదీ, బహ్రెయిన్, మహారాష్ట్ర జాగృతి సంస్ధల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.