ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో అష్టావధాన కార్యక్రమంగా ఘనంగా జరిగింది. జనరంజని రేడియో సంస్థ, శ్రీవేదగాయత్రి పరిషత్, సంగీత భారతి న్యూజిలాండ్ తెలుగు సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో ఆగస్టు 30వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా అవధాని, అవధానార్చనా భారతి, కవిరాజహంస, శారదామూర్తి శ్రీ తటవర్తి శ్రీకళ్యాణ చక్రవర్తి చేసిన అవధానం అందర్నీ ఆకట్టుకుంది. ఈ అవధాన కార్యక్రమానికి న్యూజిలాండ్ ప్రప్రథమ శతకకర్తగా రికార్డులు సాధించిన శ్రీమతి డా. తంగిరాల నాగలక్ష్మి సంచాలకురాలిగా నిర్వహించారు.
సమస్య, దత్తపది, వర్ణన, నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, ఆశువు, కృతిపద్యం, చిత్రానికి పద్యం, అప్రస్తుత ప్రసంగం అనే అంశాలతో ఉత్కంఠతో సాగిన ఈ అష్టావధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం ఉన్నత సాహిత్య ప్రమాణాలతో కొనసాగింది. తెలుగు భాషను, సాహిత్యాభిమానాన్ని పెంచడానికి ఇటువంటి కార్యక్రమాలను తరచూ నిర్వహించాలని పలువురు ప్రేక్షకులు సూచించారు.
ఈ అవధాన కార్యక్రమాన్ని వీక్షించిన పలువురు ప్రముఖులు.. అవధాని, సంచాలకులు, నిర్వాహక సంస్థలను అభినందించారు. తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలకు తగిన ప్రోత్సాహాన్ని కల్పించారు. అప్రస్తుత ప్రసంగంలో పాల్గొన్న 11 ఏళ్ల చిరంజీవులు కృష్ణ సుహాస్ తటవర్తి ధ్రువ్ అకెళ్ళ అప్పటికప్పుడే అద్భుతమైన ప్రశ్నల వర్షం కురిపించడం అవధానాలలోనే ప్రత్యేకత సంతరించుకున్నది. కృతిపద్యం అనే అంశంలో చిన్నారులు గాయత్రి నందిరాజు, తన్వి వంగల సభాసదుల మనసులను చూరగొన్నారు. సాంకేతిక సహకారం శరణ్ తోట అందించారు.