హైదరాబాద్ : ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య(Hong Kong), భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, ప్రతిభావంతులైన కళాకారులు ప్రోత్సహించడంలో ముందుటున్నది. భారతదేశంలోని విభిన్న కళారూపాలను ప్రదర్శించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి మన్నననలు పొందుతున్నది. తాజాగా వారధి ఫౌండేషన్, శ్రుతిలయ కేంద్ర నటరాజలయ (హైదరాబాద్) వారి సహకారంతో హాంగ్ కాంగ్లో ‘మార్గం’ అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. భరతనాట్యం, కర్ణాటక సంగీతంలో రాణిస్తున్న యువ కళాకారిణి నారాయణి గాయత్రి ఈయుణ్ణి(Narayani Gayatri) సోలో రిసైటల్ ఏర్పాటు చేశారు.
గురు కలైమామణి డా.రాజేశ్వరి సాయినాథ్ గారి శిష్యరికంలో ఇటీవలే ఆగస్టు 2023లో హైదరాబాద్ లో తన ఆరంగేట్రం చేసి అందరి మన్ననలు పొందింది. ఆమె సాధించిన ఆరంగేట్ర విజయాన్ని పురస్కరించుకుని, హాంగ్కాంగ్లోని లాంటౌ ద్వీపంలో తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్లో 6 జనవరి 2024న ఇచ్చిన నృత్య ప్రదర్శన అందరి ప్రశంసలను అందుకున్నది.
ఈ కార్యక్రమానికి హాంగ్ కాంగ్ & మకావులోని భారత కాన్సుల్ జనరల్ హాజరై, ప్రారంభోత్సవం చేశారు.
వారు గాయత్రి మరియు ఆమె తల్లిదండ్రులను శాస్త్రీయ కళారూప సంస్కృతిని కొనసాగించడాన్నిఅభినందించారు. గాయత్రికి ప్రశంసా పత్రాన్ని అందించి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసులు ఉస్తాద్ ఘులాం సిరాజ్, కథక్ గురువులు నీశ ఝవేరి, శ్వేత రాజ్ పుట్, భరతనాట్యం గురువు సంధ్య గోపాల్, మోహినియాట్టం గురు దివ్య అరుణ్, మృదంగం కళాకారుడు అరవింద్ జేగాన్, ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి పాల్గొన్నారు .