డాలస్, టెక్సస్: డాలస్ ఇర్వింగ్ నగరంలోని మహాత్మాగాంధీ మెమోరియల్లో అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో జరిగినన ఈ వేడుకల్లో ప్రవాస భారతీయులు, వివిధ భారతీయ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇర్వింగ్ మేయర్ యాల్ జపంటా మాట్లాడుతూ.. అమెరికా అభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్ర ప్రశంసనీయమని కొనియాడారు. ఇర్వింగ్ నగర ప్రగతికి తోడ్పడుతున్న ప్రవాస భారతీయులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక అతిథిగా హాజరైన టెక్సస్ రాష్ట్ర ప్రతినిధి మ్యాట్ షాహీన్ మాట్లాడుతూ.. ఎన్నో దశాబ్దాలుగా టెక్సస్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు టెక్నాలజీ, విద్యా, వైద్య రంగాలలో తమ ప్రతిభను చూపుతూ రాష్ట్ర ఆర్ధికాభివృద్ధికి తద్వారా అమెరికా జీడీపీ వృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నారని కొనియాడారు. 50 మందికి పైగా “స్వర స్వాతి సింగింగ్ గ్రూప్” చిన్నారులు అమెరికా జాతీయగీతంతో సహా అనేక అమెరికా దేశభక్తి గీతాలు ఆలపించడం హర్షణీయమని అన్నారు. ఈ దేశ భవిష్యత్ ఈ యువత చేతిలోనే ఉందని పేర్కొన్నారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ .. “ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ప్రజాస్వామ్య దేశాలలో ఒకటైన అమెరికా స్వాతంత్ర్యానికి 250 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఒక చారిత్రక ఘట్టం అన్నారు. ఈ రెండున్నర శతాబ్దాల ప్రయాణంలో అమెరికా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రపంచంలోని అనేక దేశాల నుంచి వచ్చిన ప్రజలు వారితో పాటు తీసుకు వచ్చిన తమ భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, ప్రతిభతో ఈ దేశాన్ని మరింత సుసంపన్నం చేశారు. భారతీయ మూలాలున్న అమెరికన్లకు విద్య, ఉపాధి, వ్యాపారం, శాస్త్ర సాంకేతిక రంగాలు, వైద్యం, ప్రజాసేవ ఇలా ప్రతి రంగంలోనూ ఎదగడానికి ఈ దేశం విశాలమైన అవకాశాలను కల్పించింది అందుకు కృతజ్ఞతలు అన్నారు. మన భారతీయ సంస్కృతిని, విలువలను కాపాడుకుంటూ మనం అమెరికా సమాజంలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం మనకు హక్కులను మాత్రమే ఇవ్వదు; బాధ్యతలను కూడా గుర్తు చేస్తుంన్నారు. మనకు లభించిన స్వేచ్ఛను గౌరవించండి.. వైవిధ్యాన్ని ఆదరించండి.. నిజాయితీని ఆచరించండి.. మానవత్వాన్ని పెంపొందించండి.. విభేదాలకంటే ఐక్యతను, స్వార్థం కంటే సేవాభావాన్ని, ద్వేషం కంటే ప్రేమను ఎంచుకుని ముందుకు సాగాలని సూచించారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యులు రావు కల్వల, తయాబ్ కుండావాలా, మహేంద్ర రావు, రాజేంద్ర వంకా వాలా, రాంకీ చేబ్రోలు, దీపక్ కార్లా, అనంత మల్లవరపు, ముర్తుజా భాయ్, సోనిట్ సింగ్, కలై కృష్ణమూర్తితో సహా అనేక సంఘాల ప్రతినిధులు అధికసంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అమెరికా 250 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం ప్రత్యేక గీతాలతో పిల్లకు తర్ఫీదు ఇచ్చి, 50 మందికి పైగా చిన్నపిల్లలతో దేశభక్తి గీతాలను పాడించిన స్వర స్వాతి సింగింగ్ గ్రూప్ అధినేత స్వాతి కుప్పిలికి, సహకరించిన పిల్లల తల్లిదండ్రులకు, కార్యకర్తలకు, ముఖ్యఅతిథిగా హాజరైన ఇర్వింగ్ మేయర్ యాల్ జపంటా, ప్రత్యేకఅతిథి టెక్సస్ రాష్ట్ర ప్రతినిధి మ్యాట్ షాహీన్ కు రావు కల్వల ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు
