ఆదిలాబాద్ : జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో గల జలపాతంలో ప్రమాదవశాత్తు పడి చనిపోయాడు. గడిచిన ఆదివారం చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం భోరిగాం గ్రామానికి చెందిన ఏలేటి లక్ష్మారెడ్డి, శోభారెడ్డి దంపతుల చిన్న కుమారుడు ఆలేటి నిహార్ రెడ్డి(31). గత మూడేళ్ల నుంచి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తూ అమెరికాలోని వాషింగ్టన్లో నివసిస్తున్నాడు.
నిహార్రెడ్డి సెలవులను సరదాగా గడిపేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వాషింగ్టన్ డీసీకి చెందిన ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం లేక్ సమ్మమిష్ అనే జలపాతం వద్దకు వెళ్లాడు. అయితే అనుకోకుండా జారి సరస్సులో పడిపోవడంతో ఈతరాని నిహార్ జలపాతంలో గల్లంతయ్యాడు. గాలింపు చర్యల అనంతరం మృతదేహాన్ని వెలికితీశారు. తమ కళ్లెదుటే కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వేదన వర్ణణాతీతంగా మారింది.
నిహార్ రెడ్డి అతని అన్న నిఖిల్ రెడ్డి మూడేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. నిహార్రెడ్డి రెండేళ్ల క్రితం హైదరాబాద్కు చెందిన యువతిని ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం భార్య కావ్య గర్భిణి. మూడు నెలల క్రితమే ఏలేటీ లక్ష్మారెడ్డి, శోభ దంపతులు అమెరికాలోని కొడుకుల వద్దకు వెళ్లారు. ఆదివారం సెలవుదినం కావడంతో కుటుంబ సమేతంగా జలపాత సందర్శనకు వెళ్లారు. అకస్మాత్తుగా కాలుజారి జలపాతంలో పడిపోవడంతో నిహార్ రెడ్డి మృతి చెందాడు.