హైదరాబాద్ : వందలాది భాగవతం పద్యాలలను అలవోకగా అప్పచెప్తూ అంతర్జాతీయ పద్య పోటీల్లో సత్తా చాటుతోంది ఏడో తరగతి విద్యార్థి అద్దంకి వనీజ. విజయవాడలోని ‘నలందా విద్యానికేతన్’లో 7వ తరగతి విద్యార్థిని వనీజ అంతర్జాతీయ అంతర్జాల పద్యపఠన పోటీలలో వరుసగా నాలుగోసారి (2020, 2021, 2022, 202) ప్రథమస్థానంలో నిలిచి తన విజయపరంపరను కొనసాగించింది.
తన పద్యాలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నవనీజ ఇప్పుడు మరో అరుదైన విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకుంది.‘రవి గాంచిన పోతన భాగవతం’ పేరిట భాగవతం ఆణిముత్యాలు (IBam) సంస్థవారు ఆస్ట్రేలియా నుంచి ఉత్తర అమెరికా వరకూ ఉన్న (ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, మిడిల్ ఈస్ట్, నార్త్ అమెరికా, భారతదేశం) దేశాలలోని 6-18 సంవత్సరాల పిల్లలకు నిర్వహించిన పోతన భాగవతం పద్యాల అంతర్జాతీయ అంతర్జాల పోటీలో 10-13 వయస్సు విభాగంలో అత్యుత్తమస్థానంలో నిలిచి ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది.
ఈ పురస్కారానికి గానూ 251 డాలర్ల (రూ.20,395) నగదు బహుమతిని IBam సంస్థ అధినేత శ్రీమాన్ పుచ్చా మల్లిక్ అందజేశారు. గత రెండు నెలలుగా ‘నరసింహ జయంతి నుండి వామన జయంతి వరకూ’ సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా ఇంకా ఉత్తర అమెరికాలోని అనేక రాష్ట్రాలతో సహా భారతదేశంలోని 1000 కు పైగా బాలబాలికలు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన వనీజను ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ అధ్యక్షురాలు డా. నందమూరి లక్ష్మీపార్వతి, నలందా విద్యానికేతన్ చైర్మన్ విజయబాబు, తదితరులు అభినందించారు. మరిన్ని పోటీలలో విజేతగా నిలవాలని ఆకాంక్షించారు.