డిచ్పల్లి, జనవరి 1 : మండలంలోని యానంపల్లి గ్రామానికి చెందిన గూండ్ల భూమయ్య వారం రోజుల క్రితం దుబాయ్లో గుండెపోటుతో మృతిచెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గూండ్ల భూమయ్య కొన్ని నెలల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. డ్యూటీ నుంచి రూమ్కి వచ్చిన తర్వాత రాత్రి నిద్రిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో మృతిచెందినట్లు తోటి స్నేహితులు మృతుడి కుటుంబీకులకు సమాచారం అందజేశారు. బాధిత కుటుంబీకులు ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్కు ఈ విషయాన్ని విన్నవించి మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి వచ్చేలా చూడాలని కోరారు. స్పందించిన జగన్.. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ కవితకు వివరించారు. ఆమె దుబాయ్లోని భారత రాయబారి కార్యాలయ అధికారులతో మాట్లాడి మృతదేహాన్ని త్వరగా రప్పించేందుకు కృషిచేశారు.
మృతదేహం ఆదివారం హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు రాగా… అక్కడి నుంచి స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు అంబులెన్స్ను ఏర్పాటు చేయించారు. ఆదివారం సాయంత్రం భూమయ్య అంత్యక్రియలను గ్రామంలో నిర్వహించారు. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి రప్పించేలా, హైదరాబాద్ నుంచి అంబులెన్స్ సౌకర్యం కల్పించిన ఎమ్మెల్సీ కవిత, ధర్పల్లి, డిచ్పల్లి జడ్పీటీసీ సభ్యులు బాజిరెడ్డి జగన్, ఇందిరా లక్ష్మీనర్సయ్యకు బాధిత కుటుంబీకులు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.