ఆధార్ ప్రతి ఒక్కరికీ ఉండాల్సిన ధ్రువీకరణ పత్రం. ఈ నేపథ్యంలో అప్పుడే పుట్టిన బిడ్డకు కూడా ఆధార్ కార్డు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దవాఖానలోనే వివరాలను నమోదు చేసి, ఆధార్కార్డు అందజేస్తున్నది.
కామారెడ్డి, ఫిబ్రవరి 3 : భారత పౌరులకు ఆధార్ కార్డు తప్పనిసరి చేయడంతో ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకుంటున్నారు. చిన్నపిల్లల విషయంలో ఆధార్ ఎన్రోల్మెంట్పై చాలామంది తల్లిదండ్రులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. బడికెళ్లే వయస్సు వచ్చేదాకా ఆధార్ కార్డు అవసరం లేకపోవడంతో పిల్లలు ఐదేండ్లు వచ్చేవరకు వివరాలను నమోదు చేసుకోవడంలేదు. కొందరికి అవగాహన లేకపోవడంతో పిల్లలకు ఆధార్ కార్డును తీసుకోవడంలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చైల్డ్ ఎన్రోల్మెంట్ ైక్లెంట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. సీఎం కేసీఆర్ సర్కారు అమలుచేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. అక్కడ పుట్టిన శిశువులకు వెంటనే ఆధార్ నమోదు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఏరియా దవాఖానల్లో ఏర్పాట్లుచేసి శిశువుల వివరాలను నమోదు చేసుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖానలో డిసెంబర్ మొదటి వారం నుంచి చిన్నారుల ఆధార్ నమోదు ప్రక్రియను ప్రారంభించారు.
మాతా శిశు సంక్షేమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం, కేసీఆర్ కిట్లు అందజేస్తున్నారు. దీంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో అప్పుడే పుట్టిన శిశువుల ఆధార్ వివరాలను సైతం సేకరిస్తున్నారు. బయోమెట్రిక్, ట్యాబ్ తదితర అన్ని పరికరాలను సమకూర్చి ఆధార్ నమోదు ప్రక్రియ బాధ్యతలను డేటా ఎంట్రీ ఆపరేటర్లకు అప్పగించారు. శిశువు ఫొటోతోపాటు తల్లి, తండ్రి బయోమెట్రిక్ వివరాలు నమోదు చేయగానే ఎన్రోల్మెంట్ నంబర్ వస్తుంది. దీనిద్వారా ఎక్కడైనా ఆధార్ కార్డును తీసుకునే అవకాశం ఉంది. తల్లి పేరుతోపాటు ‘శిశువు’ అనే పేరు నమోదవుతుంది. శిశువుకు పేరు పెట్టిన తర్వాత వివరాలను సవరించుకునే అవకాశం కల్పిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖానలో డిసెంబర్లో 120, జనవరిలో 253 మంది చిన్నారులకు ఆధార్ కార్డులను అందజేశారు.
చిన్నపిల్లల ఆధార్ నమోదుపై కొందరు తల్లిదండ్రులు శ్రద్ధ వహించడంలేదు. ప్రభుత్వ దవాఖానల్లో పుట్టిన శిశువులకు ఆధార్ కార్డు కోసం వెంటనే వివరాలు నమోదు చేస్తున్నాం. ఆధార్ ఎన్రోల్మెంట్పై డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చాం. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం.
-డాక్టర్ విజయలక్ష్మి, సూపరింటెండెంట్,
కామారెడ్డి ఏరియా దవాఖాన