వినాయక్నగర్, మే 24: ఆనాడు తెలంగాణ బలిదేవత సోనియమ్మ ఈనాడు తెలంగాణ తల్లి ఎట్లయిందో సీఎం రేవంత్రెడ్డి చెప్పాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. శుక్రవారం నిజామాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వందల మందిని బలి తీసుకున్న బలి దేవత సోనియాగాంధీ అని అన్న రేవంత్రెడ్డి.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఆమెను ఎలా ఆహ్వానిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. నాడు తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేస్తుంటే ఆ కన్న తల్లిదండ్రుల కడుపుకోత చూడలేక బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ పార్లమెంట్లో తెలంగాణ గోసను వినిపించారని గుర్తుచేశారు. కానీ, ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉద్యమాన్ని అణచివేయాలని చూశారని, ఆంధ్ర నాయకులకు అమ్ముడుపోయారన్నారు. తెలంగాణ బిడ్డల ప్రాణాలు పోతుంటే పదవే ముఖ్యమని గోడ మీద పిల్లిలా వ్యవహరించిన ఘనత కాంగ్రెస్ నాయకులదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో వారు చేసింది శూన్యమని తెలిపారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చి, తెలంగాణను ఇంకా అప్పుల కుప్పచేసి, ఉన్న ప్రభుత్వ ఆస్తులను అమ్మే పనిలో కాంగ్రెస్ వారు ఉన్నారన్నారు. తెలంగాణ సొమ్మంతా ఢిల్లీకి దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు.