కోటగిరి, ఏప్రిల్ 18 : జాతి సంపద బాలలే..బాల్యం ఎలాంటి ఒడిదొడుకుల్లేకుండా ఎదగాలి. ఉజ్వల భవితకు ఈ దేశంలోనే పునాది పడాలి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. పేదరికం కారణంగా పనులకు వెళ్లాల్సిన పరిస్థితి. బాల్య వివాహాలు గుట్టుగా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చి చిన్నారుల మోమున చిరునవ్వులు పూయించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అడుగేసింది. బాలల సంరక్షణ కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కమిటీలు కొలువుదీరడం విశేషం.
హక్కులు కాపాడేలా..
ఐక్యరాజ్యసమితి ఒడంబడిక ప్రకారం 54 హక్కులను బాలలకు ప్రత్యేకంగా నిర్దేశించారు. మొదటి నుంచి 42 వరకు బాలలకు సంబంధించినవి. ఆ తర్వాతవి వారి చైతన్యానికి అమలు చేయాల్సిన చర్యలను పేర్కొన్నారు.ఇందులో భాగంగా నాలుగింటిని ప్రధానమైనవిగా గుర్తించారు. అవి జీవించడం,రక్షణ పొందడం, భాగస్వామ్యం, అభివృద్ధి చెందే హక్కు. వీటి సంరక్షణకు గ్రామ, మండల,జిల్లా స్థాయిలో బాలల సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. 18ఏండ్లలోపు ఉన్న వారు ఎలాంటి పనులు చేయకూడదన్న నిబంధన అమలు చేస్తున్నారు.
భవిష్యత్తు కోసం..
పేద కుటుంబాల్లో చాలా మంది తల్లిదండ్రులు, సంరక్షకులు పిల్లలను ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. పనులకు పంపిస్తున్నారు. దీంతో బాగా చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాల్సిన వారికి భవిత అన్నది లేకుండా పోతున్నది. ఇక బాలికలకు కనీస వయసు రాకుండానే పెండ్లి చేస్తున్నారు. దీంతో ఆరోగ్యరీత్యా సమస్యలు ఏర్పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలెన్నో వెలుగుచూస్తున్నాయి. ఇలాంటివి నిరోధించేందుకు బాలల సంరక్షణ కమిటీలు కృషి చేయనున్నాయి. ఊరూరా అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. బాధ్యులు నిర్వర్తించాల్సి విధులను వివరిస్తున్నారు.
సభ్యులు వీరే..
గ్రామస్థాయిలో సర్పంచ్, మండలస్థాయిలో మండల పరిషత్ అధ్యక్షతన, జిల్లాలో జిల్లా పరిషత్ అధ్యక్షులు చైర్మన్లుగా కమిటీలు పని చేస్తాయి. గ్రామస్థాయిలో అంగన్వాడీ టీచర్, మండల స్థాయిలో సీడీపీవో, జిల్లాలో సంక్షేమాధికారి కన్వీనర్లుగా, గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, మండలస్థాయిలో ఎంపీడీవో, జిల్లాలో కలెక్టర్ కార్యదర్శులుగా ఉంటారు. వైద్య, విద్య, పోలీసు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, మహిళా సమాఖ్య, న్యాయశాఖ,రెవెన్యూ, పాఠశాల కమిటీలు, యువజన సంఘాలు, బాలల సంఘాల సభ్యులు, తల్లిదండ్రులను సభ్యులుగా నియమిస్తున్నారు. ఇక పురపాలికల్లో వార్డుస్థాయిలో కౌన్సిలర్ అధ్యక్షుడిగా ఉంటారు.
కోటగిరి మండల స్థాయిలో అవగాహన సదస్సులో మాట్లాడుతున్న సీడీపీవో జానకీ
ప్రతి గ్రామంలో..
జిల్లాలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ, మండల,జిల్లా స్థాయిలో కొలువుదీరనున్నాయి. మార్చి మొదటి వారం నుంచి జిల్లాలో కమిటీల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా స్థాయిలో ఒకటి, మండల స్థాయిలో 28, గ్రామస్థాయిలో 530 కమిటీలు ఏర్పాటు కానున్నాయి.
జిల్లా, మండల కేంద్రాల్లో సదస్సులు..
బాల్య వివాహ వ్యవస్థను రూపుమాపడమే లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నారు. ఇందుకోసం కమిటీల బలోపేతానికి చర్యలు చేపట్టారు. జిల్లాలో 530 గ్రామ పంచాయతీలు ఉండగా తొలి విడుతలో బాల్య వివాహాలు అధికంగా జరిగిన గ్రామ పంచాయతీలను సదస్సుల నిర్వహణకు ఎంపిక చేశారు. తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు.
పకడ్బందీగా నిర్వహిస్తున్నాం..
బాలల సంరక్షణకు ప్రాధాన్యమిస్తున్నాం. ఇందులో భాగంగా గ్రామస్థాయి నుంచి బాలల సంరక్షణ కమిటీలను ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నాం. వాటిని బలోపేతం చేసి బాలల హక్కుల రక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటాం. వారి భవితకు బాటలు వేసేలా దిశానిర్దేశం చేస్తాం.
– సుధారాణి, సంక్షేమాధికారిణి, నిజామాబాద్