TU VC | నిజామాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ యూనివర్సిటీలో రెండేండ్లుగా కుంటుపడిన పరిపాలనను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీసీ రవీందర్ గుప్తా నిర్వాకంతో వర్సిటీ ప్రతిష్ట పూర్తిగా దిగజారింది. నిత్యం వివాదాల్లో నిలుస్తూ పరువు పోగొట్టుకున్నది. వీసీ తీరు రోజురోజుకూ వివాదాస్పదం అవుతున్న సమయంలోనే రవీందర్ గుప్తా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం, జైలు ఊచలు లెక్కబెట్టడం చకచకా జరిగిపోయాయి. దాదాపు నెల రోజులు జైల్లో ఉన్న రవీందర్గుప్తా.. ఈ నెల 13న బెయిల్పై బయటికి వచ్చారు. అంతలోపే రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను వైస్ చాన్స్లర్గా నియమించడంతో రవీందర్ గుప్తా సేవలకు ముగింపు పలికినట్లు అయ్యింది. టీయూ ఇన్చార్జి వీసీగా ఐఏఎస్ అధికారి నియమితులవ్వడం ఇది ఐదోసారి.
టీయూ పరిపాలన ఇకపై గాడిలో పడనున్నది. సీనియర్ ఐఏఎస్ అధికారిణి, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణను ఇన్చార్జి వీసీగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో టీయూలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. వీసీ రవీందర్ తన విధులను సక్రమంగా నిర్వర్తించకపోగా అవినీతి, అక్రమాలతో అరెస్టు కావడంతో ఆయనను సర్వీసుల నుంచి తప్పించింది. వీసీని అవినీతి కేసులో బాధ్యతల నుంచి తప్పించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. వాకాటి కరుణ నేతృత్వంలో పరిపాలనను చక్కబెట్టేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈసీ మీటింగ్లకు వీసీ హోదాలో రవీందర్గుప్తా డుమ్మా కొట్టిన సందర్భాల్లో వాకాటి కరుణ అధ్యక్షతన పాలకవర్గ సమావేశాలు జరిగాయి. టీయూలో జరిగిన ప్రతి అంశంపై విద్యా శాఖ కార్యదర్శిగా పూర్తిస్థాయిలో ఆమెకు అవగాహన ఉండడంతో కీలక బాధ్యతలను సర్కారు కట్టబెట్టింది.
వీసీ రవీందర్ గుప్తా హడావుడి నిర్ణయాలతోపాటు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. గతంలో హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను కాదని ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకోవడంపై ప్రభుత్వం సీరియస్గా ఉన్నది. 2014లో నియామకమైన పలువురు ఆచార్యుల వ్యవహారంపై ఏండ్లుగా న్యాయస్థానాల్లో విచారణ సాగుతున్నది. 44 మంది ఆచార్యులను యదావిధిగా కొనసాగించాల్సి ఉండగా వీరికి రిజిస్ట్రార్ పోస్టులు అప్పగించడం దుమారం రేపింది. ప్రభుత్వం నియమించిన పాలకవర్గాన్ని సుప్తావస్థలో పెట్టి వీసీ ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చు చేశారు. ఈ మధ్యనే ప్రమోషన్లు పొందిన ఇద్దరు సహాయ రిజిస్ట్రార్లు అంతా తామై నడిపించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రవీందర్ గుప్తా అవసరాన్ని గుర్తించి ఇష్టారీతిన బహిరంగంగానే డబ్బులు దండుకుని ఉత్తర్వులు జారీ చేయడం, ప్రమోషన్లు, బదిలీలకు పాల్పడడం జరిగింది. సెమినార్లు, సమావేశాల పేరుతో ఇష్టారీతిన ఖర్చు చేశారు. అంతర్జాతీయ సదస్సు పేరుతో ప్రైవేటు కళాశాలల నుంచి బలవంతంగా చందాలు వసూలు చేశారు. ఫర్నిచర్ పేరుతోనూ రూ.కోట్లు దండుకున్నారు. ఇందులో కీలక పాత్రదారుడు రవీందర్ గుప్తా ఇప్పటికే జైలుకు వెళ్లగా ఆయనకు వంతపాడినవారి గుట్టు విజిలెన్స్ విచారణలో రట్టు కానున్నట్లుగా తెలుస్తున్నది.
టీయూకు తొలి వీసీగా సులేమాన్ సిద్ధిఖీ 3 నెలలపాటు ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 4 నెలలు పాటుగా సులోచనారెడ్డి పనిచేశారు. శాశ్వత వీసీగా కాశీరామ్ 2006, నవంబర్ 6న బాధ్యతలు స్వీకరించి 2009 నవంబర్ 3 వరకు అత్యధిక కాలం పనిచేసి యూనివర్సిటీని ఓ తోవలోకి తీసుకొచ్చారు. ఆయన ఉద్యోగ విరమణ తర్వాత ఎన్.లింగమూర్తికి ఇన్చార్జిగా బాధ్యతలివ్వగా ఏడాదిపాటు పనిచేశారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన తిరుపతి రావు ఇన్చార్జిగా 3 నెలలపాటు విధులు నిర్వహించారు. అనంతరం 6 నెలలు వి.గోపాల్రెడ్డి ఇన్చార్జిగానే విధులు నిర్వహించారు.
అక్బర్ అలీఖాన్ను 2011, జూలై 15న ప్రభుత్వం వీసీగా నియమించగా 2014 జూలై 14 వరకు పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం ఆరు నెలలపాటు ఐఏఎస్ శైలజా రామయ్యర్ పని చేసిన తర్వాత రెండేండ్ల పాటు ఐఏఎస్ పార్థసారథి సైతం ఇన్చార్జి వీసీగా విధుల్లో చేరారు. ప్రభుత్వం 2016, జూలై 25న పి.సాంబయ్యను వీసీగా నియమించింది. ఆయన 2019, జూలై 24న ఉద్యోగ విరమణ చేశారు. అనంతరం ఐఏఎస్ అధికారుల వి.అనిల్ కుమార్ ఆరు నెలలు, నీతూ కుమారి ప్రసాద్ ఏడాదిన్నర కాలంపాటు పని చేసిన తర్వాత 2021, మే 22న రవీందర్ గుప్తాను ప్రభుత్వం వీసీగా నియమించింది. ఏసీబీ కేసుల నేపథ్యంలో ఆయనను బాధ్యతల నుంచి తప్పించడంతో ఈ నెల 13 నుంచి ఐఏఎస్ అధికారిణి వాకాటి కరుణ ఇన్చార్జి వీసీగా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకు 14 మంది వీసీలుగా నియమితులైతే ముగ్గురు రెగ్యులర్ ప్రాతిపదికన ఉన్నారు. మిగిలిన వారంతా ఇన్చార్జి వీసీలుగానే కొనసాగగా ఇందులో ఐదుగురు ఐఏఎస్ అధికారులున్నారు.