Balkonda MLA Vemula Prashanth Reddy | బాల్కొండ : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువత మొక్కవోని పోరాట పటిమతో సాధించిన ప్రజాస్వామ్య విజయమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత రాజకీయాలకు అతీతంగా తమ భవిష్యత్ కోసం, విద్యా వ్యవస్థలో పారదర్శకత కోసం చేపట్టిన ఉద్యమం చివరకు ఫలితాన్ని ఇచ్చిందన్నారు. పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలు, విద్యార్థుల భవిష్యత్పై నెలకొన్న అనిశ్ఛితికి వ్యతిరేకంగా యువత శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా చేసిన పోరాటానికి కేంద్ర ప్రభుత్వం చివరకు స్పందించి దిగిరాక తప్పలేదన్నారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం లాఠీచార్జీలు, భాష్పవాయు గోళాలు, నిర్బంధాలను ఆశ్రయించినప్పటికీ, దేశ యువత ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అపారమైన ధైర్యంతో తమ ఉద్యమాన్ని కొనసాగించిందన్నారు.
అధికారం ఎంత బలంగా కనిపించినా, చైతన్యవంతమైన యువత సంకల్పం ముందు తలవంచక తప్పదనే విషయాన్ని ఈ ఉద్యమం మరోసారి నిరూపించిందని అన్నారు. యువత ఐక్యపోరాటం ముందు ప్రభుత్వం దిగివచ్చే పరిస్థితి ఏర్పడిందని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆ ప్రజాస్వామ్య పోరాటానికి లభించిన నైతిక విజయమని పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ‘దేశం కోసం అవసరం వచ్చినప్పుడు ఇండియా రియాక్ట్ అవుతుంది..’ అనే మాటలను ఎమ్మెల్యే గుర్తు చేశారు. నేడు దేశ యువత అదే విషయాన్ని మరోసారి సాక్షాత్కరించిందన్నారు. ‘యువత ప్రశ్నించడం ప్రారంభిస్తే అధికార వ్యవస్థలు జవాబుదారీతనం వహించక తప్పదు. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకే అంతిమ తీర్పు’ అని అన్నారు. ‘చదువుకున్న యువత కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే కాదు.. దేశ భవిష్యత్ కోసం కూడా పోరాడుతుందని ఈ ఉద్యమం స్పష్టం చేసింది. జ్ఞానం, చైతన్యం, ఐక్యత కలిసొస్తే ఏ అహంకారమైనా కూలిపోవాల్సిందే’ అని వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు, విద్యా వ్యవస్థ విశ్వసనీయత, పరీక్షల పారదర్శకత వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం సమగ్ర సంస్కరణలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
‘సమస్యలు మొదలైన వెంటనే బాధ్యతాయుతంగా స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. విద్యార్థుల ఆవేదనను నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి’ అని విమర్శించారు. ఇకపై దేశంలో ఏ విద్యార్థి కూడా పరీక్షల అవకతవకల కారణంగా నష్టపోకుండా కఠినమైన, పారదర్శకమైన పరీక్షల వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ‘ఇది ఒక వ్యక్తి రాజీనామాతో ముగిసే అంశం కాదు. దేశ విద్యా వ్యవస్థపై విద్యార్థుల్లో సంపూర్ణ విశ్వాసం నెలకొనే వరకు సంస్కరణలు కొనసాగాలి. అదే ఈ ఉద్యమం ఇచ్చిన అసలైన సందేశం’ అని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేశ యువతకు ఈ విజయం ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందని, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా పోరాడితే మార్పు సాధ్యమేననే నమ్మకాన్ని ఈ ఉద్యమం దేశ ప్రజల్లో మరింత బలపరిచిందని ఆయన పేర్కొన్నారు.