ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కరంట్ కోతలు ఫుల్లుగా ఉండెటివి. ఉదయం కరెంటు పోతే రాత్రి దాకా అచ్చేది కాదు.. పని ఏ మాత్రం ఒడ్వకపోయేది. కేసీఆర్ సార్ అచ్చినంక 24 గంటల కరంటు ఇస్తున్నరు. నాతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాను. నిరంతరం కరెంటు ఇస్తుండడంతో పని సక్రమంగా కొనసాగుతున్నది. చేతినిండా పని ఉంటున్నది.
– వాజిద్, మోటర్ వైండింగ్ దుకాణం, నిజాంసాగర్
రాష్ట్రం రాక మునుపు కరెంటు ఉంటే వార్త… ఎప్పుడు వస్తుందో..ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. పొద్దాంత ఉంటే రాత్రిళ్లు ఉండకపోతుండె. ఇండ్లల్లో పరిస్థితి ఒకలా ఉంటే… చిరువ్యాపారుల పరిస్థితి మరీ ఘోరంగా ఉండేది. రోజులో రెండు, మూడు గంటలు మాత్రమే కరెంటు ఉండేది. దీంతో ఏ పని కూడా చేయలేక దిక్కుతోచని స్థితిలో అల్లాడేవారు. పవర్ హాలీడేలు ప్రకటించేవారు. దీంతో ఎంతో మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడేవారు. ప్రధానంగా పిండి గిర్ని మొదలుకొని వెల్డింగ్, జిరాక్స్ మిషన్, వడ్రంగి, ఫొటో స్టూడియోలు, మోటార్ వైండింగ్ తదితర చిన్న పరిశ్రమల వారు కరెంటు కోతలతో ఇబ్బంది పడేవారు.
స్వరాష్ట్రంలో కరెంటు పోతే వార్త… నిరంతరాయంగా విద్యుత్ సరఫరా. రాత్రింబవళ్లు ఇంటింటా కరెంటు కాంతులు. ఇక లోవోల్టేజీ సమస్యను అధిగమిస్తూ అదనంగా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడంతో చిరుపరిశ్రమలకు నిరంతరంగా నాణ్యమైన కరెంటు అందుతున్నది. దీంతో చిరు పరిశ్రమల్లో పనులు సాఫీగా సాగుతున్నాయి. 24 గంటలపాటు విద్యుత్ సరఫరా అవుతుండడంతో చిరుపరిశ్రమల యజమానులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
డిచ్పల్లి /సిరికొండ/ ముప్కాల్ / నిజాంసాగర్, జనవరి 5: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో విద్యుత్ కొరతను అధిగమించడంతోపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతున్నది. ఫలితంగా 24 గంటలపాటు చిరుపరిశ్రమల్లో పనులు సాఫీగా కొనసాగుతున్నాయి. దీంతో ఉపాధి అవకాశాలు సైతం మెరుగుపడ్డాయి. గతంలో పరిశ్రమలకు పగలు రెండు గంటలు, రాత్రి రెండు గంటలపాటు అధికారికంగా పవర్ కట్ చేసేవారు.
అనధికారికంగా రోజుకు ఆరు, ఏడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేసేవారు. విద్యుత్ సరఫరా సరిగ్గా లేక రోజుల తరబడి కంపెనీలను మూత వేసుకోవాల్సిన పరిస్థితులు ఉండేవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మెరుగైన విద్యుత్ సరఫరా కోసం అదనంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. అవసరమైన చోట విద్యుత్ లైన్లను కూడా వేసింది. దీంతో విద్యుత్ సరఫరా మెరుగుపడి టీవీ మెకానిక్లు, ఫ్యాన్లు, మిక్సీలు రిపేర్ చేసే ఎలక్ట్రీషియన్స్, జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు, కూల్డ్రింక్స్ అమ్ముతూ జీవనం గడిపే చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నిండాయి.
ఇండ్లలో నడిపే కుటీర పరిశ్రమలతోపాటు వాణిజ్య సముదాయాలు, దుకాణాలు, అన్ని రకాల వ్యాపార వర్గాలకు సైతం నిరంతరం కరెంటు సరఫరా అవుతున్నది. దీంతో ఆయా వాణిజ్య, వ్యాపార సంస్థల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా షాపింగ్ మాల్స్తోపాటు ఓ మాదిరి వ్యాపార సంస్థల్లో గతంలో కరెంటు కోతలతో తప్పనిసరిగా జనరేటర్ వినియోగించేవారు. కానీ జనరేటర్ల వినియోగం భారీ ఖర్చుతో కూడినది కావడంతో వచ్చిన ఆదాయంలో ఎక్కువ దానికే పెట్టాల్సి వచ్చేది. ప్రస్తుతం నిరంతర విద్యుత్ సరఫరాతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయాయి. ఇక కరెంటుపై ఆధారపడి రోజువారీ ఉపాధి పొందే వారి జీవితాల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. సీఎం కేసీఆర్ కృషితోనే నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుందని వ్యాపారవర్గాలు, సామాన్యులు కొనియాడుతున్నారు.
చేసుకున్నంత పని
సమైక్య రాష్ట్రంలో కరెంటు కోతతో పరిశ్రమలు సరిగ్గా నడవలేకపోయినయ్. తెలంగాణ వచ్చిన తర్వాత నిరంతరం కరెంటు సరఫరాతో చేసుకున్నంత పని దొరికింది. గతంలో కరెంటు కష్టాలతో షాప్ను సరిగ్గా నడుపలేకపోయేవాళ్లం. వ్యవసాయానికి సంబంధించిన మోటర్లు, వెల్డింగ్ పనుల కోసం ఎక్కువగా వచ్చేవి. కరెంటు సరిగ్గా ఉండకపోవడంతో పని చేయలేకపోయేవాళ్లం. సమయానికి మోటర్లు రిపేరు చేసి ఇవ్వలేక రైతుల పొలం ఎండిపోయేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
-బాదే శ్రీనివాస్, మోటర్ వైండింగ్, సిరికొండ
కోతల బాధ పోయింది
తెలంగాణ వచ్చిన తర్వాత కరెంటు కష్టాలు దూరమయ్యాయి. గతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కరెంటు కోసం ఎదురుచూసేవాళ్లం. ప్రస్తుతం 24గంటల పాటు నిరంతరాయంగా కరెంటు సరఫరా అవుతుండడంతో వ్యాపారం సైతం చక్కగా కొనసాగుతుంది. కూల్డ్రింక్స్తోపాటు పాలు, పెరుగు అమ్మకాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగిస్తున్నా. మన దగ్గర కరెంటు ఉన్నట్లు పక్కనే ఉన్న కర్నాటక, మహారాష్ట్రలో లేదు.
– ఎల్లాగౌడ్, కూల్డ్రింక్స్ దుకాణం, నిజాంసాగర్
కరెంటు పోవుడు లేదు..
సీఎం కేసీఆర్ సారు కరెంటు కష్టాలను తీర్చిండు. తెలంగాణ అచ్చినంక కరెంటు పోవుడు లేదు. ఇప్పుడు నేను పిండి గిర్నిని పొద్దాంత నడిపిస్తున్న. అచ్చే పైసలు మా కుటుంబానికి ఆసరా అవుతున్నయ్. తెలంగాణ రాక మునుపు ఎప్పుడూ కరెంటు ఉండేది కాదు. గిర్నిని నడిపించేంత కరెంటు ఉండక కష్టాలు పడేటోళ్లం. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సీఎం అయ్యి.. అటు పొలాలకు, ఇటు చిన్న యాపారం చేసుకునేటోళ్లకు కరెంటు మంచిగ ఇస్తుండు. ఆయనకు రుణపడి ఉంటం.
– చాట్ల శోభ, గిర్ని నిర్వాహకురాలు, ముప్కాల్
కరెంటు కోతల్లేవ్..
కేసీఆర్ సీఎం అయినప్పటి నుంచి కరెంటు కోతలు లేవు. అంతకుముందు రోజుకు రెండు,మూడు గంటలు మాత్రమే కరెంటు సరఫరా జరిగేది. పరిశ్రమలకు 24గంటల పాటు కరెంటు సరఫరా అవుతుండడంతో మేము ప్రశాంతంగా పని చేసుకోగలుగుతున్నాం. దీంతో రోజూ మాకు పని లభిస్తున్నది.
– సాయిలు, రైస్మిల్ కార్మికుడు, డిచ్పల్లి
చేతి నిండా పని ఉంది..
సమైక్య పాలనలో కరెంటు ఇబ్బందులు అనేకంగా ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తుండడంతో చేతినిండా పనిదొరుకుతుంది. నిత్యం వెల్డింగ్ చేస్తూ నలుగురికి ఉపాధి కల్పించడంతోపాటు మా జీవనం సాగిస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎంతో రుణపడి ఉంటాం.
– ఎండీ అన్వర్, వెల్డింగ్ షాపు నిర్వాహకుడు, డిచ్పల్లి