ఒకటే సంకల్పం.. ఒకటే ఆశయం.. సర్కారు కొలువును ఒడిసి పట్టాలన్న ఏకైక లక్ష్యంతో నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. పేపర్ లీకేజీ ఘటన అనంతరం ప్రతిపక్షాలు చేసిన డ్రామాలను లైట్గా తీసుకున్న అభ్యర్థులు.. ప్రిపరేషన్లో నిమగ్నమయ్యారు. అభ్యర్థుల్లో సర్కారుపై నమ్మకం ఏమాత్రం సడలలేదు. కొలువులు సాధించాలన్న సంకల్పం ఏమాత్రం తరగలేదు.. వారి మనసంతా లక్ష్యంపైనే.. ధ్యాసంతా పుస్తకంపైనే.. దీంతో లైబ్రరీలన్నీ ఇప్పటికీ నిండుగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని కుట్రలు పన్నినా యువత పోటీ పరీక్షలపైనే ఫోకస్ చేసింది. విపక్షాల మాయలో పడకుండా ప్రిపరేషన్పైనే దృష్టంతా పెట్టింది.
ఖలీల్వాడి, మార్చి 25 : ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకు పూలబాట వేస్తున్నది. నీళ్లు, నిధులు, నియామకాల్లో ఒకటైన ఉద్యోగాల కల్పన కోసం వరుసగా నోటిఫికేషన్లు వేస్తున్నది. ఈ నేపథ్యంలో యువత వివిధ పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నారు. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్-1 పేపర్ లీకేజీ వ్యవహారం కలకలం రేపడంతో.. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధికోసం దీనిపై నానా యాగి చేస్తున్నప్పటికీ అభ్యర్థులు ఇవేమీ పట్టించుకోకుండా తమపని తాము చేసుకుంటున్నారు. ఎన్ని కుట్ర లు, అసత్య ప్రచారాలు చేసినా కష్టపడితేనే సర్కారు కొలువు దక్కుతుందని గట్టిగా నమ్ముతున్నారు. ఇందుకోసం రేయింబవళ్లూ కష్టపడుతున్నారు. స్థోమత ఉన్నవారు ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తుండగా.. మిగితావారు చదువుకునేందుకు అనువుగా ఉండే గ్రంథాలయాలకు వెళ్తున్నారు.
లీకేజీలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కష్టపడ్డవారికి అన్యాయం జరుగకూడదని వెంటనే గ్రూప్-1 పరీక్షను రద్దు చేసింది. ప్రశ్నపత్రం లీకేజీలో దోషులెంతటి వారైనా సరే విడిచిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఈ మేరకు ప్రభుత్వ నియమించి సిట్ కూడా దూకుడుగా ముందుకెళ్తున్నది. అయినా ఈ వ్యవహారాన్ని ప్రభుత్వానికి అంటగట్టేందుకు ప్రతిపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఉద్యోగార్థులు వారి మాయలో పడడం లేదు. చదువులు మానేసి మాతో రండి అంటూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. అయినా అభ్యర్థులు ఇవేమీ పట్టించుకోకుండా కష్టపడితే ఉద్యోగం సాధించవచ్చేనే ధీమాతో ఉన్నారు. నిత్యం పుస్తకాలతో కుస్తీ పడుతూ పోటీపడి చదువుతున్నారు. నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం యువతకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నది.
ఒకప్పుడు పాడుబడిన భవనాల్లో నిర్వహించిన గ్రంథాలయాలను రాష్ట్ర ప్రభుత్వం అధునాతనంగా తీర్చిదిద్దింది. భారీగా నిధులు కేటాయించి విద్యార్థులు, పాఠకుల కోసం అన్ని సౌకర్యాలూ కల్పించింది. దీనికి తోడు అన్ని పోటీపరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ను అందుబాటులో ఉంచింది. ప్రత్యేకంగా రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేయించింది. చదువుకునేందుకు పూర్తి అనువుగా మారడంతో గ్రంథాలయాలన్నీ ప్రతిరోజూ కిటకిటలాడుతున్నాయి. కొన్నిచోట్ల దాతల సహకారంతో ఉచితంగా భోజనం కూడా అందించడంతో అభ్యర్థులు ఉదయాన్నే లైబ్రరీలకు చేరుకొని చీకటి పడేదాకా అక్కడే ఉంటూ చదువుకుంటున్నారు. నిమామాబాద్ నగరంలోని జిల్లా గంథ్రాలయం, బాపూజీ వచనాలయం, సుభాష్నగర్, చంద్రశేఖర్ కాలనీల్లోని గ్రంథాలయాలు వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులతో సందడిగా కనిపిస్తున్నాయి.