నిజామాబాద్ క్రైం, మార్చి 3 : నగరంలో గంజాయి విక్రయించే వారు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన ఇద్దరు యువకులు మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తూ యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్నారు. రూరల్ పోలీసులు గురువారం సాయంత్రం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ రూరల్ ఎస్సై జి.లింబాద్రి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని అసద్బాబా నగర్కు చెందిన సర్ఫరాజ్ ఖాన్, షేక్ అవేస్ అనే ఇద్దరు యువకులు మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన రితేశ్ అనే వ్యక్తి నుంచి రూ.19 వేలకు 2 కేజీల గంజాయి కొనుగోలు చేసి నిజామాబాద్కు తరలించారు.
అనంతరం గంజాయిని 10 గ్రాముల చొప్పున ప్యాకెట్లు తయారు చేసి రూ.300 ఒకటి చొప్పున నగరంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. గురువారం సాయంత్రం చంద్రశేఖర్ కాలనీలో బైక్పై వెళ్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకొని తనిఖీ చేశారు. దీంతో వారి వద్ద 77 ప్యాకెట్లలో ఉన్న 740 గ్రాముల గంజాయి లభించగా వాటిని సీజ్ చేసినట్లు తెలిపారు. రెండు సెల్ ఫోన్లు, ఒక బైక్ సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. నిజామాబాద్ ఏసీపీ ఎం.కిరణ్ కుమార్ పర్యవేక్షణలో సౌత్ రూరల్ సీఐ జె.నరేశ్, టాస్క్ఫోర్స్ సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో నిందితులను పట్టుకున్నట్లు వెల్లడించారు.