కాటిపల్లికి నిట్టు వేణుగోపాల్రావు సవాల్
కామారెడ్డి, మే 26 : బీజేపీ నేత కాటిపల్లి వెంకటరమణా రెడ్డి తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి నిజాయితీని నిరూపించుకోవాలని, తన తండ్రి ఇంటిని రోడ్డు వెడల్పు కోసం ఈ నెల 28న కూల్చేందుకు జేసీబీతో సిద్ధ్దంగా ఉంటానని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్ రావు అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు, వ్యాపారులు, నాయకులను బెదిరించడం మానుకొని తాను అడిగిన ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పాలన్నారు. జన్మభూమి రోడ్డులో గల తన తండ్రి ఇంటిని పట్టణ ప్రజల సౌకర్యార్ధం రోడ్డు వెడల్పు కోసం కూల్చడానికి శనివారం 10 గంటలకు జేసీబీతో సిద్ధంగా ఉంటానని, దమ్ముంటే తన ఇంటిని కూల్చడానికి వెంకట రమణారెడ్డి జేసీబీతో సిద్ధంగా ఉండాలన్నారు.
రమణారెడ్డి ఇల్లు 502/83 సర్వే నంబర్ 843/బీ, 844/బీ వద్ద 80 ఫీట్ల రోడ్డులో ఉందన్నారు. రోడ్డు నిర్మాణం జరుగకుండా నిలిచిపోయినందున ఇద్దరి ఇండ్లను ఒకేసారి కూల్చేద్దామని, దీనికి సిద్ధంగా ఉండాలన్నారు. ఈ నెల 24న మీడియా సమావేశంలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాటవేసే ధోరణిని అవలంబిస్తున్నారని ఆరోపించారు. కామారెడ్డి మున్సిపాల్టీలో బీజేపీ కౌన్సిలర్ల అవినీతిని బట్టబయలు చేస్తానన్నారు. తన ప్రశ్నలకు బీజేపీ నేత సమాధానం చెప్పి ముందుకు వస్తే సోమవారం మున్సిపాల్టీ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమే అంటూ సవాల్ విసిరారు. విలేకరుల సమావేశంలో కామారెడ్డి మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ కుంబాల రవియాదవ్, కౌన్సిలర్లు ముప్పారపు ఆనంద్, నిట్టు కృష్ణ మోహన్, కృష్ణాజిరావు, నాయకులు కాసర్ల స్వామి, ముదాం నవీన్ తదితరులు పాల్గొన్నారు.