డిచ్పల్లి, జనవరి 9 : గల్ఫ్ పంపిస్తానని 600 మంది దగ్గర డబ్బులు వసూలు చేసిన ట్రావెల్ ఏజెంట్ పరారయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. డిచ్పల్లి మండల కేంద్రంలో ఆర్కే ట్రావెల్స్ను ఏర్పాటు చేసిన యజమాని షేక్ బషీర్ యువకులను విదేశాలకు పంపిస్తానని ఒక్కొక్కరి వద్ద రూ.60వేల చొప్పున సుమారు రూ.4 కోట్లు వసూలు చేసి రాత్రికి రాత్రే బోర్డు తిప్పేశాడు. విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. కోపోద్రిక్తులైన వారు సోమవారం నిజామాబాద్- హైదరాబాద్ రహదారిపై బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. మోసం చేసిన షేక్ బషీర్పై సీపీ నాగరాజు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ట్రావెల్స్ ఏజెన్సీ కార్యాలయంలో పనిచేసే రాంపూర్ గ్రామానికి చెందిన షేర్ లింబాద్రిని బాధితులంతా పట్టుకొని నిలదీశారు. ఏజెంట్ ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని తమకు రెండు రోజుల్లో వీసాలు వస్తున్నాయని చెప్పి నమ్మబలికి ఆరోగ్య పరీక్షలు చేయించి మోసం చేశాడని వాపోయారు. బాధితుల్లో నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల్ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. నిజామాబాద్లో తమకు మెడికల్ పరీక్షలు చేయించి ఒక్కొక్కరి వద్ద రూ.6500 వసూలు చేశారన్నారు. ఎస్సై గణేశ్ ఆందోళనకారులను సముదాయించి పంపించారు.