బోధన్, డిసెంబర్ 28: ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం తీరు ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు..’ అన్నట్లుగా ఉండేంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం వైద్యరంగం అభివృద్ధి, వైద్య సేవలను ప్రజలకు అందేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషిచేసింది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి అనేక చర్యలు తీసుకుంది. ఫలితంగా వైద్య సేవల్లో గణనీయమైన మార్పు వచ్చింది.
ప్రైవేటు దవాఖానలకు దీటుగా పీహెచ్సీలు సేవలు అందిస్తున్నాయి. ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులో ఉంచడంతోపాటు రోగులకు అవసరమైన మందులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరఫరా చేస్తున్నది. గ్రామీణ వైద్య వ్యవస్థను మరింతగా బలోపేతం చేసేందుకు పీహెచ్సీలను నిరంతరం ‘లైవ్’లో ఉంచాలన్నది ప్రభుత్వ నిర్ణయం.
ఈ మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏం జరుగుతుందో జిల్లా కేంద్రంతోపాటు హైదరాబాద్ నుంచి ఎప్పుడైనా తెలుసుకునేలా ఆడియో, విజువల్ కన్వర్టర్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. కేవలం నిఘా కోసమే కాకుండా ఈ వ్యవస్థ ద్వారా వైద్య సేవల సమన్వయం, నాణ్యమైన వైద్యానికి సంబంధించిన సలహాలు అందించడం, అన్నింటికీ మించి పారదర్శకతను పెంచడం.. ఈ ‘లైవ్’ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం. గ్రామీణ వైద్య వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఇది మరో ముందడుగని చెప్పవచ్చు.
జిల్లాలోని 27 పీహెచ్సీల్లో..
నిజామాబాద్ జిల్లాలోని 27 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను హైదరాబాద్లోని రెండు కమాండ్ కంట్రోల్ సెంటర్లతో అనుసంధానం చేసేందుకు ఆడియో, వీడియో విజువల్స్ కన్వర్టర్స్తో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డాక్టర్ గది, ల్యాబ్, ఫార్మసీలో ఒక్కోటి చొప్పున ప్రతి దవాఖానలో మూడు కెమెరాలను అమర్చారు. హైదరాబాద్లోని సచివాలయంలో, కోఠిలోని వైద్యశాఖ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్లతో వీటిని అనుసంధానం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్ పొందిన ఈసీఐఎల్ సంస్థ ఈ సీసీ కెమెరాల ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నది. జిల్లాలోని పీహెచ్సీలకు, హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ల మధ్య అనుసంధానం చేసే ప్రక్రియ త్వరలో పూర్తికానుంది. ట్రయల్స్ నిర్వహించిన అనంతరం ఈ ‘లైవ్’ వ్యవస్థను అధికారికంగా త్వరలో ప్రారంభించనున్నారు.
నిఘాతో పాటు మెరుగైన వైద్య సేవలు..
పీహెచ్సీల్లో అమర్చిన ఆడియో, వీడియో విజువల్ కన్వర్టర్లతో కూడిన సీసీ కెమెరాలతో జిల్లాలోని ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నైనా.. ఏ సమయంలోనైనా హైదరాబాద్ నుంచి పరిశీలించవచ్చు. ఆయా పీహెచ్సీల్లో రోగులకు అందుతున్న సేవలను పర్యవేక్షించవచ్చు. డాక్టర్లు, సిబ్బంది సమయపాలన, రోగులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు? వైద్య పరికరాల వినియోగం, ల్యాబ్లు, ఫార్మసీల్లో సేవలను తెలుసుకునే అవకాశం ఉంది. ఈ నిఘాతో వైద్యులు, సిబ్బంది పనితీరు మరింతగా మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. నిఘాతోపాటు వైద్య సేవల్లో పారదర్శకత, విధుల నిర్వహణలో సమన్వయం పెరిగేందుకు ఈ ఆన్లైన్ వ్యవస్థ ఉపయోపడుతుంది.
అన్నింటికీ మించి వైద్యులు, రోగులకు భద్రత పెరుగుతుంది. దవాఖానకు ఎవరు వస్తున్నారు? ఎవరు వెళ్తున్నారు..? వంటివి నిరంతరం గమనించవచ్చు. ఏదైనా సమస్య వస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్ల నుంచి తగిన సలహాలు అందుతాయి. వైద్యానికి సంబంధించి ఆడియో, వీడియోల ద్వారా మాట్లాడుకునే వెసులుబాటు ఉంటుంది. సీజనల్ వ్యాధులు ప్రబలినప్పుడు, ఆ ప్రాంతం పీహెచ్సీ వైద్యులు, సిబ్బందితో అధికారులు నేరుగా మాట్లాడి సమన్వయం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది.
మరింత మెరుగైన వైద్య సేవలు..
పీహెచ్సీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లకు వీటిని అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ ‘లైవ్’ సిస్టమ్తో పీహెచ్సీలపై నిరంతర నిఘా ఉంటుంది. డాక్టర్లు, సిబ్బంది సమయపాలన, పనితీరును పరిశీలించడంతోపాటు సలహాలు, సూచనలు అందజేయవచ్చు. దీంతో రోగులకు మరింత మెరుగైన సేవలు అందుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య వ్యవస్థ బలోపేతం అవుతుంది.
-సుదర్శనం, డీఎంహెచ్వో, నిజామాబాద్