కెరటం నాకు ఆదర్శం లేచినాపడినందుకు కాదు..పడినాలేచినందుకు.
జీవితంలో రిస్క్ తీసుకో.. గెలిస్తే విజేత అవుతావు.. ఓడితే ఆ అనుభవంతో దారి చూపగలుగుతావు.
మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు.. బలహీనులుగా భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులే
-స్వామి వివేకానంద.
లే.. మేలుకో.. లక్ష్యం చేరుకునే వరకు విశ్రమించకు అన్నారు స్వామి వివేకానంద. వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం అన్నాడాయన. జాతి నిర్మాణ క్రతువులో యువత భాగస్వామ్యం ఎంతో కీలకం. దేశ సంపదను పెంచి పోషించే చోదక శక్తి యువతే. వివిధ రంగాల్లో రాణిస్తున్న పలువురు యువకులు సామాజిక బాధ్యతగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు అందుకుంటూ శెభాష్ అనిపించుకుంటున్నారు. స్వామివేకానంద జయంతి సందర్భంగా జరుపుకొనే జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువత సేవలపై ప్రత్యేక కథనం…
ఖలీల్వాడి, జనవరి 11
మేము సైతం సమాజానికి సేవ చేయాలనే భావన యువతలో అధికమవుతున్నది. కొంతమంది ఇప్పటికే వివిధ సంఘాలు స్థాపించి, లేదా గ్రామాల్లో ఒక్కటిగా అయి తమ సమీపంలో ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తున్నారు. సరదాలు.. షాపింగ్… సినిమా.. యువత అంటే ఇంతేనా? కాదు.. అంతకుమించి అని నిరూపిస్తున్నారు ఈ యువకులు. కష్టాల్లో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించి పెద్ద మనసు చాటుకుంటున్నారు. మానవత్వం మురిసేలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు యువకులు.
నిజామాబాద్ జిల్లాలో ఎన్నో సంవత్సరాల నుంచి ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ పేరుతో అధ్యక్షుడు డాక్టర్ సాయిబాబు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రోడ్లపై పడుకున్న యాచకులకు అండగా ఉంటాడు. అంతేకాకుండా వాళ్లకి ఆహారం అందించి, వారికి కటింగ్ చేయించి, కొత్త బట్టలు వేసి వారి రూపురేఖలను మార్చుతారు. మతిస్థిమితం సరిగా లేని, యాచకుల్లా ఉండే వారిలో ఎవరైనా గాయపడినా, ప్రమాదం బారినపడినా వెంటనే దవాఖానకు తీసుకెళ్లి వైద్యం అందేలా చేస్తారు. అంతేకాకుండా ఆనాథ శవాలకు అంతిమ సంస్కరణలు చేస్తారు. దిక్కులేనోడికి దేవుడే దిక్కుఅంటారు. కానీ దిక్కూమొక్కులేని వాళ్లు కాలం చేస్తే వారిని కాటికి చేర్చే విధంగా సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేస్తారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి అవార్డులు అందుకున్నారు. ప్రజాప్రతినిధుల ప్రశంసలు పొందాడు.
జిల్లాలో ఎవరికి సాయం కావాలన్నా ఇందూరు యువత అం డగా ఉంటుం ది. అనాథ శవాలకు అంతిమయాత్ర, అంత్యక్రియలు చేసేందుకు మా సంస్థ సిద్ధంగా ఉం టుంది. ఆకలి అం టే తీర్చేలా ఇందూరు యువత గుర్తు కు వచ్చేలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం
అన్నార్థులకు బాసటగా నిలవాలని నిర్ణయించుకున్నాడు ఆ యువకుడు. విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తున్నా… మొదట ఇంట్లోనే ప్రత్యేకంగా భోజనం తయారు చేయించి తను వెళ్లేదారిలోని నిరుపేదలు, అభాగ్యులకు అందించాడు. అనంతరం తన భావాలతో కలిసిన మరికొంత మంది యువతీయువకుల సహకారంతో ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ పేరుతో 365 రోజులు అన్నార్థుల ఆకలి తీర్చే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఈయన చేస్తున్న సేవలకు ప్రజలు, ప్రముఖులు సైతం చేయూతనందించారు. అన్నార్థుల ఆకలి తీర్చడంలో భాగంగా వంట సామగ్రిని అందజేశారు. కరోనా విపత్కర సమయంలోనూ ఫుడ్ బ్యాంకు నిజామాబాద్ సేవలు ముమ్మరంగా చేపట్టారు. కరోనా బాధితులకు ఆహార పొట్లాలను అందించారు. లాక్డౌన్ సమయంలో కాలినడకన ఇంటికి వెళ్తున్న వలస కూలీలకు భోజనం అందించారు. ఫుడ్ బ్యాంకు నిజామాబాద్ వాహనం ద్వారా బస్టాండ్, రైల్వేస్టేషన్, ఆర్మూర్, బోధన్ తదితర ప్రాంతాల్లోని ఆకలితో అలమటించే యాచకులు, నిరాశ్రయులకు భోజనం పెట్టి కడుపు నింపుతున్నారు. తాజాగా మూగజీవాలకు సైతం భోజనం అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు ఫుడ్ బ్యాంకు సంస్థ వ్యవస్థాపకుడు, వలంటీర్లు.
జిల్లాలో ఎక్కడ ఎవరు ఆకలితో ఉన్నా తెలిసిన వెంటనే వారి ఆకలి తీరుస్తాం. నిరుపేద, అభాగ్యులకు కడుపు నిండా భోజనం అందిస్తున్న అనుభూతి అనిర్వచనీయం. అన్నార్థుల ఆకలి తీర్చే ఈ మహాయజ్ఞానికి ఎవరైనా సాయం చేస్తే స్వీకరిస్తాం.
– నవీన్, ఫౌండర్, ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్
ఆకలి కష్టాలు ఎవరికీ రావొద్దనే ఉద్దేశంతో ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ సంస్థలో సేవలందిస్తున్న. అభాగ్యుల ఆకలి తీర్చే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం నా అదృష్టం. సమయం దొరికినప్పుడల్లా పేదల సేవలో నిమగ్నమవుతాం. నాతోపాటు చాలా మంది వలంటీర్లు ఫుడ్ బ్యాంక్లో పని చేస్తున్నారు. ఇందులో పని చేయడం జీవితానికి సంతృప్తినిస్తుంది.
– ఆదిత్య, ఫుడ్ బ్యాంక్ వలంటీర్