ఖలీల్వాడి, డిసెంబర్ 23 : జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఏటా డిసెంబర్ 24న నిర్వహించుకుంటాం. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 1986 ప్రకారం తమ అవసరార్థం వస్తువులు లేదా సేవలు కొనుగోలు చేసేవారు వినియోగదారులు. కొనుగోలుదారు అనుమతితో ఆ వస్తువులు, సేవలు వినియోగించుకునేవారు సైతం వినియోగదారులే. జిల్లాలో వినియోగదారులకు జరిగే అన్యాయంపై జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం పోరాటం చేస్తుంది. రోజురోజుకూ కొత్త టెక్నాలజీ అందుబాటులో వస్తున్న ఈ తరుణంలో నకిలీ వస్తువులు జాడ్యం మార్కెట్ను పట్టి పీడిస్తున్నది. దీనిని అధిగమించడానికి వినియోగదారుల సమాచార కేంద్రం ద్వారా కేసులు వేసి పరిష్కరించవచ్చు.
2017-18 సంవత్సరంలో 210 కేసులు, 2019లో 150 ఫిర్యాదులు, 2020లో 220, 2021లో 200 కేసులు, 2022లో 423 కేసులకు గాను 200 కేసులు పరిష్కరించగా.. 223 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో టూ వీలర్, ఫోర్ వీలర్, వాటర్ ఫిల్టర్, గ్యాస్, రేషన్, పెట్రోల్ దుకాణాలపై ఫిర్యాదులు అధికంగా వచ్చాయి.
ఫిర్యాదు చేసి విధానం చాలా సులువు. తెల్ల కాగితం ఫిర్యాదు వివరాలు రాసి పంపవచ్చు. ఏ న్యాయవాది అవసరం లేకుండా ఎవ్వరైనా వినియోగదారుల సమాచార కేంద్రంకు వెళ్లి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. అన్ని రకాల వస్తువుల పై ఫిర్యాదు చేసే హక్కు వినియోగదారులకు ఉంది.
వినియోగదారులు తమకు జరిగిన నష్టాన్ని వినియోగదారుల ఫోరం దృష్టికి తీసుకువెళ్లవచ్చు. 1800 425 0033 లేదా 1967 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి సలహాలు పొందవచ్చు. మరిన్ని వివరాలకు జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలోని వినియోగదారుల సమాచార కేంద్రంలో లేదా అధ్యక్షుడు ఎం.రాజేశ్వర్ (9396451999) ను సంప్రదించవచ్చు.
వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తున్నాం. జిల్లాలో ఇప్పటివరకు 423 కేసులు రాగా 223 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ప్రతి వస్తువును కొనుగోలు చేసిన తర్వాత రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే సమస్య పరిష్కారం కష్టతరమవుతుంది.
– మయావార్ రాజేశ్వర్,
జిల్లా వినియోగదారుల కేంద్రం చైర్మన్
ప్రతి వినియోగదారుడు ఏదైనా వస్తువును కొన్న తర్వాత రసీదును తప్పకుండా తీసుకోవాలి. నాణ్యత లేని వస్తువులు ఇస్తే వెంటనే 1800 425 0033 లేదా 1967 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి . రసీదు తీసుకోవడం ద్వారా ప్రశ్నించేందుకు వీలవుతుంది.
– గుజ్జ రాజేశ్వరి,
జిల్లా వినియోగదారుల సంఘం సభ్యురాలు