శక్కర్నగర్, మార్చి 3: హోలీ పండుగ పూట విషాదం నెలకొన్నది. ఆచన్పల్లికి చెందిన ఇద్దరు యువకులు మంజీరాలో స్నానం కోసం వెళ్లి మృత్యువాత పడగా, ఆర్మూర్లో ఓ విద్యార్థి చెరువులో నీట మునిగి దుర్మరణం చెందా డు. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనలు బాధితకుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. బోధన్ పట్టణం ఆచన్పల్లికి చెందిన సాయికుమార్ (20), రోను చౌదరి (19) స్నేహితులతో కలిసి ఉదయం రంగులు పూసుకొని సంబురాలు చేసుకున్నారు. అనంతరం స్నేహితులు, మరికొందరితో కలిసి స్నానం కోసం సాలూరా మండలంలో మంజీరా నదికి వెళ్లారు. నదిలో స్నానానికి దిగిన సాయికుమార్, రోను చౌదరి నీటిలో ఊబి ఉండడంతో మునిగిపోయారు. వెంట వచ్చినవారితోపాటు మరికొంత మంది స్నేహితులు గుర్తించే సరికి వారు ఊపిరాడక మృతి చెందారు. సమాచారం అందుకున్న యువకుల కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. గ్రామస్తులు మృతదేహాలను బయటికి తీశారు. ఇంటి నుంచి పండుగ సంబురాలకు వెళ్లిన తమ పిల్లలు విగతజీవులుగా మారడంపై కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
గ్రామంలో విషాదం
రోను చౌదరి, సాయికుమార్ ఇద్దరు స్నేహితులు. ఇద్దరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రోను చౌదరి హైదరాబాద్లోని ఓ ప్రైవేట కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతుండగా, సాయికుమార్ జీవనోపాధిలో భాగంగా విదేశాలకు వెళ్లి ఇటీవలే బోధన్కు వచ్చాడు.
కన్నీటి సంద్రంలో బాధిత కుటుంబాలు
ఆచన్పల్లిలో నివాసం ఉంటున్న సోంపూర్ శంకర్ హన్మవ్వకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. చేతికందిన కుమారుడు సాయికుమార్ మృతి చెందడం వారి కుటుంబాన్ని కలిచివేసింది. ఇటీవలే దుబాయ్ నుంచి వచ్చి తిరిగి వెళ్లాల్సి ఉండగా, ఇలా మృత్యువాత పడడంపై కుటుంబీకులకు కన్నీరు మిగిల్చిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్బారావు – రేణుక దంపతులకు ఇద్దరు సంతానం. చిన్న కుమారుడు రోను చౌదరి బీటెక్ సెకండియర్ చదువుతుండగా పండుగ కోసం ఇంటికి వచ్చినట్లు సమాచారం. చిన్న వయస్సులో ఇద్దరు యువకులు నీట మునిగి మృతి చెందడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది.
చెరువులో మునిగి విద్యార్థి..
ఆర్మూర్టౌన్, మార్చి 3: ఆర్మూర్ పట్టణంలోని చెరువులో మునిగి పదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. పట్టణంలోని 13వ వార్డుకు చెందిన బొగడ మీది హర్షిత్ అలియాస్ నాని (16) మంగళవారం హోలీ పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి రంగులు ఆడాడు. అనంతరం స్నానాల కోసం గుండ్ల చెరువుకు వెళ్లారు. స్నేహితులతో కలిసి స్నానం చేస్తుండగా లోతులోకి వెళ్లిన హర్షిత్ ఈతరాక నీటమునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటికి తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ తెలిపారు.