నిజాంసాగర్, జనవరి 11: నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న యాసంగి పంటల కోసం మూడో విడుత నీటి విడుదలను గురువారం ప్రారంభించినట్లు ఏఈ శివకుమార్ తెలిపారు. ఉదయం వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా మధ్యాహ్నానికి రెండు వేల క్యూసెక్కులకు పెంచి ప్రధాన కాలువ ద్వారా విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఆయకట్టు కింద సాగు చేస్తున్న లక్షా 35 వేల ఎకరాలకు మొత్తం ఆరు విడుతల్లో నీటిని విడుదల చేయనున్నామని ఇప్పటి వరకు నవంబర్, డిసెంబర్ నెలల్లో రెండు విడుతల్లో 2.99 టీఎంసీల నీటిని విడుదల చేశామని వివరించారు.
ప్రస్తుతం మూడో విడుత ప్రారంభించామని రైతుల అవసరాలకు అనుగుణంగా ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదలను హెచ్చుతగ్గులుగా పదిరోజులపాటు విడుదల చేస్తామని తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం మొత్తం 1405.00 అడుగుల (17.80 టీఎంసీలు)కు గాను ప్రస్తుతం 1401.97 అడుగుల (13.64 టీఎంసీలు) వద్ద ఉన్నదని పేర్కొన్నారు. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.